కరోనాకు మందు లేదు, వాక్సిన్ రాలేదు, ట్రీట్మెంట్ లేదు అంటున్నారు. కానీ ప్రముఖులు చాలా మంది కార్పొరేట్ ట్రీట్మెంట్ పొంది కరోనాను జయించి ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయి బయటకు వస్తుండగా..సామాన్యులు మాత్రం సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు.
వీఐపి ట్రీట్మెంట్ కరోనా నుండి కాపాడుతున్నదా? నాయకులు కరోనాను ఎలా జయిస్తున్నారు? కరోనా సోకిన ప్రముఖులు డబ్బులు ఖర్చు పెట్టి అపోలోకో, యశోద కో వెళ్లిపోతున్నారు. ఏపిలో ఎమ్మెల్యే లైనా, తెలంగాణలోని ఎమ్మెల్యే లైనా, ఇతర ప్రముఖులు అయినా హైదరాబాద్ లోని కార్పొరేట్ వైద్యానికే వెళ్లిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్,తెలంగాణ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, ఏపిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తదితర ప్రముఖులకు కరోనా సోకగా కార్పొరేట్ ట్రీట్మెంట్ పొంది దాదాపు అందరూ కరోనాను జయించేసారు.
కార్పొరేట్ వైద్యం పొందుతున్న వారిలో దాదాపు అందరూ కరోనాను జయించి బయటపడుతున్నారు. ప్రభుత్వ వైద్యం పొందుతున్న సామాన్యులు మాత్రమే కరోనాను జయించలేక ప్రాణాలు వదులుతున్నారు. కరోనా సోకిన పేషెంట్ ను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చాలంటే కనీసం రోజుకు 50 వేల నుండి లక్ష వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. అంత ఖర్చు పెట్టే స్తోమత లేక సామాన్యులు ఎక్కువ మంది దేవుడి భారం వేస్తూ ప్రభుత్వ వైద్యాన్నే నమ్ముకుంటున్నారు.
దేశ వ్యాప్తంగా నేటి వరకు 14 లక్షల 83 వేల మంది కరోనా బారిన పడగా 9లక్షల 52వేల మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. 33,425మంది మృత్యువాత పడ్డారు. ఏపిలో ఇటీవల కేసుల సంఖ్య, మరణాల సంఖ్య బాగా పెరుగుతున్నది. ఇప్పటి వరకు లక్షా 2వేల మందికి పైగా కరోనా సోకగా 1090మంది మరణించారు. 49,558మంది చికిత్స అనంతరం కోలుకోగా 51,701యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
కాగా కరోనా బాధితుల పట్ల మొదట్లో చూపిన శ్రద్ద ఇప్పుడు చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి. కరోనా వ్యాధి గ్రస్తులను గుర్తించడంలో, వారిని, వారితో కాంటాక్ట్ అయిన వారిని ఆసుపత్రులకు, ఐసోలేషన్ సెంటర్ లకు తరలించడంలో జాప్యం జరుగుతోందని, తద్వారా కరోనా మరింతగా విస్తరిస్తోందని అంటున్నారు. లాక్ డౌన్ సమయంలో కరోనా సోకిన వారికి ఏ విధంగా అయితే వైద్య సేవలు అందించారో అదే మాదిరిగా చర్యలు చేపడితే కరోనా సామాజిక వ్యాప్తి జరగకుండా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.