ఏంటీ సినిమా లైన్ చెబుతున్నామనుకుంటున్నారా… అవును ఏపీలో కొత్త బీజేపీ చీఫ్ రావడంతో ఒక వర్గానికి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
మొదట్నుంచి ఆ వర్గం నేతలకు కంటగింపుగా ఉంటున్న సోము వీర్రాజు ఇప్పుడు బీజేపీ చీఫ్గా ఎలాంటి అడుగులు వేస్తారన్నదానిపై రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేగుతోంది. కన్నా అండతో కమ్మగా తమపని తాను చేసుకుపోయిన నేతలు ఇప్పుడు ఎలా అన్న ఆందోళనలోకి వచ్చారు. వాస్తవానికి వారికి టీడీపీని వీడాలన్న ఉద్దేశం లేదు. అయినా… అసలే జగన్మోహన్ రెడ్డి… ఆపై బంపర్ మెజార్టీ మొత్తంగా తమ పరిస్థితి ఏమైపోతుందోనన్న వర్షన్ తో పెద్దల సభ నుంచి చోటామోటా నాయకులంతా కమలం తీర్థం పుచ్చుకున్నారు.
వారంతా కూడా మొన్నటి వరకు సైలెంట్ గా తమపని తాను చేసుకుపోతున్నారు. పైకి బీజేపీ నాయకులుగా చలమాణీ అవుతన్నా… ఇప్పటికీ చాలా మంది సైకిల్ పార్టీ నుంచి వచ్చే ఆదేశాలనే పాటిస్తున్నారని బీజేపీ అసలు నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. అలాంటి వారిలో చాలా మంది రోజూ మీడియా చర్చల్లో టీడీపీకి భజన చేస్తూనే ఉన్నారు. కరోనాతో ఈ ఏడాది ఎలా గడుస్తుందని సగటు సామాన్యుడు భావిస్తుంటే… వీరు మాత్రం మరో మూడేళ్లు ఎలా గడిచిపోతాయా అంటూ రోజూ కేలండర్ చూస్తూ సమయం గడిపేస్తున్నారట.
ఇక సోము వీర్రాజు గత ప్రభుత్వంలో టీడీపీని చీల్చిచెండాడు. నాలుగేళ్లు సైలెంట్ గా ఉన్నా… కేంద్రం నుంచి నిధుల విషయంలో చంద్రబాబు చెప్పే మాటలన్నింటికీ కౌంటర్లు ఇచ్చేవారు.
మీడియా అటెన్షన్ సైతం వీర్రాజు అందిపుచ్చుకున్నారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబునాయుడిని ఉతికారేశాడు. అంతకు ముందు పవన్ కల్యాణ్ ను నేరుగా గుజరాత్ తీసుకెళ్లి అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీతో మాట్లాడించిన అనుభవం ఉన్న సోము… ఆ తర్వాత టీడీపీ చేతిలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. ఎమ్మెల్సీ పదవి విషయంలోనూ సోమూ కాకుండా ఇంకెవరికైనా అన్న అభిప్రాయం చెబితే… ఇది మా ఇష్టమంటూ ఢిల్లీ పెద్దలు చెప్పడంతో టీడీపీ మౌనం దాల్చింది.
తమకు రావాల్సిన హక్కును ఎంతో అవమానంగా ఇచ్చారన్న అభిప్రాయం టీడీపీపై ఉన్న సోము… మొదట్లో చూసీ చూడనట్టుగా వ్యవహరించినప్పటికీ… టీడీపీని అదునుచిక్కినప్పుడల్లా ఓ రేంజ్ లో ఆటాడుకునేవారు. ఇప్పుడు బీజేపీలో చేరిన చాలా మంది నేతలు సైతం సోమువీర్రాజును నోటికి వచ్చినట్టు అడ్డూఅదుపు లేకుండా మాట్లాడేవారు. ఆయన కూడా కౌంటర్ కు దిమ్మదిరిగే ఎన్ కౌంటర్లు ఇస్తూ ఉండేవారు. ఇటీవలే బీజేపీలో కమ్మగా చేరిన కొందరు నాయకులు టీడీపీ భజన చేస్తున్నారంటూ వారిని మీడియా డిబేట్లకు వెళ్లొద్దన్నారన్న వర్షన్ కూడా మీడియా సర్కిళ్లలో ప్రచారంలో ఉంది.
ఏమాటకామాట… పెద్దగా ఎవరినీ నొప్పించకుండా కన్నా లక్ష్మీనారాయణ తన పని తాను చేసుకుపోయేవారు. నాడు వైసీపీలో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న కన్నా… ఆ తర్వాత బీజేపీ పెద్దల నుంచి వచ్చిన సూచనలు, వైసీపీ నేతలకు బీజేపీ ఇచ్చిన క్లారిటీతో కమలం పార్టీలోనే కాలం గడపాల్సి వచ్చింది. ఇప్పుడు సోము వీర్రాజు ఎంట్రీతో లోకల్ టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతల భవిష్యత్ ఏంటన్నది చర్చనీయాంశమవుతోంది.
ఇకపై బీజేపీలో చేరాలనుకున్న నేతలు సోముతో మాట్లాడాల్సి ఉంటుంది. వారిని బీజేపీలోకి చేరే విషయంలో నాడు… స్థానిక బీజేపీ చీఫ్ హరిబాబును కలవాలంటూ వెంకయ్యనాయుడు చేసిన సూచనలు ఇప్పుడు కూడా వర్తిస్తాయ్. అంటే సోము ఈజ్ ఫైనల్. పవన్ కల్యాణ్ తో నాడు సఖ్యతగా ఉన్న సోము… వైసీపీ పెద్దలతోనూ సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే పవన్ టీడీపీ గేమ్ లో చిక్కుకుపోయారంటూ విమర్శలు గుప్పించిన వీర్రాజు… ఇప్పుడు బీజేపీకి ఏ మాత్రం కాపుగాస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది… ఏడాదిగా బీజేపీలో చేరిన నేతలు కమ్మగా ఇప్పుడు ఎలా పడితే అలా మాట్లాడితే సోమూ స్టైల్లో చెడుగుడాడటం ఖాయం.