తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో నిన్న ఒక్కరోజే 1087 కేసులు నమోదు కావడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మొత్తం కేసుల్లో 888 హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. తెలంగాణలో కరోనాతో నిన్న 6గురు మృతి చెందారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా కేసులు పెరగడం కలకలం రేపుతోంది. దీనితో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,436కి చేరగా.. కరోనా వల్ల ఇప్పటివరకు 243 మంది మృతి చెందారు.
అటు ఆంధ్రప్రదేశ్ నిన్న ఒక్కరోజు 796 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,285కి చేరింది. ఇప్పటివరకు 157 మంది కరోనాతో చనిపోయారు. కాగా, ఇప్పటివరకు అత్యధికంగా కర్నూలులో 1684 కేసులు నమోదు కాగా, కృష్ణాలో 53 కరోనా మరణాలు సంభవించాయి. నిన్న ఏపీలో 11 కరోనా మరణాలు సంభవించాయి.