కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం ఆదాయపు పన్ను కట్టేవారిని ప్రశంసిస్తూనే మరో వైపు ఆ పన్ను కట్టని వారిపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పన్ను కట్టనివారితోపాటు ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులను ఉన్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు. మరోవైపు ఇన్కమ్ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు 3 కొత్త విభాగాలను ఏర్పాటు చేశారు. అవేమిటంటే…
1. గత ఏడాదిలో రూ. 1 లక్ష లేదా అంతకన్నా ఎక్కువ మొత్తంలో కరెంటు బిల్లు కట్టిన వారు.
2. ఏదైనా బ్యాంక్ లేదా కో ఆపరేటివ్ బ్యాంకులో గత ఏడాది కాలంలో రూ.1 కోటి లేదా అంతకు పైగా డిపాజిట్ చేసిన వారు.
3. గత ఏడాదిలో రూ.2 లక్షల కన్నా ఎక్కువ ఖర్చుతో విదేశాలకు వెళ్లి వచ్చినా లేదా ఆ మొత్తాన్ని ఇతరులకు సహాయం చేసినవారు.
పైన తెలిపిన మూడు విభాగాల్లో ఎవరైనా సరే ఏదైనా విభాగానికైనా చెందితే వారు కచ్చితంగా ఈ సారి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. వారు ఆదాయం లేకపోయినా సరే ఆదాయపు పన్ను పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కేంద్రం ఈ ఏడాది నుంచే కొత్తగా ఈ రూల్ను అమలు చేస్తోంది. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 139(1) ప్రకారం పౌరులు ఈ 3 విభాగాలకు చెందితే వారు గతేడాదిలో ఆదాయం సంపాదించకపోయినా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఇక ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేవారు యథావిధిగా రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. 2019-20 ఆర్థిక సంవత్సరంతోపాటు 2020-2021 అడ్వాన్స్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేందుకు నవంబర్ 30వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు.