YS Sharmila: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు ఆక్క చెల్లిళ్లు అయినప్పటికీ ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరువురి కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు రెండు గంటల పాటు వీరి మధ్య జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తొంది.
షర్మిల పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత కలవడం ఇదే తొలి సారి. సమావేశం అనంతరం వీరు ఇద్దరు కలిసి వైఎస్ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అయితే వీరి భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తొంది. తన తండ్రి హత్యపై సునీత తొలి నుండి గట్టిగా పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడం, ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు కీలక నేతలు అరెస్టు కూడా అయ్యారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. భాస్కరరెడ్డితో పాటు ఇతరులు చంచల్ గూడ జైల్ లో రిమాండ్ ఖైదీలుగా ఉండగా, అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు నుండి బెయిల్ పొందారు. దీనిపై సునీత సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఓ పక్క నిందితులపై న్యాయపోరాటం చేస్తూనే మరో పక్క ఆ వ్యక్తులను రాజకీయంగా ఎదుర్కోవాలని సునీత భావిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే షర్మిలను సునీత కలిశారని ప్రచారం జరుగుతోంది.
కాగా, పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ బలోపేతం కోసం ఇచ్చాపురం నుండి బయలుదేరిన వైఎస్ షర్మిల వరుసగా జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి కొన్ని స్థానాలను అయినా గెలిపించి కాంగ్రెస్ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. ఇవేళ కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల పాల్గొననున్నారు.
RK Roja: మంత్రి ఆర్కే రోజాకు స్థాన చలనం తప్పదా..? ఒంగోలు లోక్ సభ స్థానానికి పరిశీలన ..!