అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయనీ, వాటికి సమాధానాలు చెప్పాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేసే అంశానికి సంబంధించి చంద్రబాబు రోజుకో డేటు చెపుతున్నారని ఉండవల్లి ఆరోపించారు. 2018 జూన్ అన్నారు, అది పోయింది మళ్లీ 2019 జూన్ అని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అంటున్నారు, మరో పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఈ ఏడాది కాదు వచ్చే ఏడాదికి పూర్తి అవుతుందని చెబుతున్నారు. ఇలా ప్రతి ఏటా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పుకుంటూ వస్తున్నారని ఉండవల్లి విమర్శించారు.
ప్రాజెక్టు వద్ద భూమి కుంగిపోవడం చిన్న విషయం కాదనీ, దానిపై జియాలజిస్ట్ను పిలిపించి సర్వే జరిపించాల్సి ఉంటుందని ఉండవల్లి అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఫ్లడ్ వస్తే రాజమండి ఊరే కొట్టుకుపోతుందని ఉండవల్లి హెచ్చరించారు. జనాలను తీసుకువెళ్లి ప్రాజెక్టు చూపడం వల్ల వారికి ప్రాజెక్టు గురించి ఏమి అర్థం అవుతుందని ఉండవల్లి ప్రశ్నించారు. తన సందేహాలను చంద్రబాబు ప్రభుత్వం నివృత్తి చేయాలని కోరుతూ, తాను లేవనెత్తిన అంశాలలో ఏమైనా తప్పు ఉన్నట్లు తేలితే క్షమాపణలు చెప్పి వెళతానని ఉండవల్లి అన్నారు.
అమరావతిలో నిర్మాణాలలో ఏమైనా తేడాలు వచ్చి లీకులు అయితే సిమెంట్ పూస్తే ఆ లీకులు ఆగిపోతాయి కానీ ప్రాజెక్టు విషయంలో ఏమైనా తప్పులు, నిర్లక్ష్యం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.