పుల్వామా, ఫిబ్రవరి 18: జమ్ము, కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సోమవారం వేకువజామున జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లతో సహా ఒక మేజర్ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవానులు తీవ్రంగా గాయపడ్డారు. జవానుల దాడిలో ఇద్దరు జైషే మహమ్మద్ తీవ్రవాదులు మృతి చెందారు..
పుల్వామా ఉగ్రదాడిలో 42మంది సిఆర్పిఎఫ్ జవాన్లను కోల్పోయిన భద్రతా దళాలు పగ తీర్చుకునేందుకు ఉగ్రవాదులు ఉన్న ప్రాంతంలోకి చొచ్చుకువెళ్లారు. దాడికి కారకులైన కొందరు ఉగ్రవాదులు ఇంకా అక్కడే ఉన్నారన్న అనుమానంతో దళాలు గస్తీ ముమ్మరం చేశాయి.
పింగ్లాన్ ప్రాంతంలో కొందరు ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున దళాలు రంగంలోకి దిగాయి.
సైన్యానికి చెందిన 55 రాష్ట్రీయ రైఫిల్స్, సిఆర్పిఎఫ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూపు దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి.
కొందరు తీవ్రవాదులను గుర్తించి లొంగిపొమ్మని హెచ్చరికలు జారీ చేశాయి.
ఉగ్రవాదులు దళాలపైకి హఠాత్తుగా కాల్పులు ప్రారంభించడంతో ముగ్గురు జవానులతో సహా ఒక మేజర్ ప్రాణాలు కోల్పోయారు.
అప్రమత్తమైన దళాలు ఉగ్రవాదులపై కాల్పులు జరపగా ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఇరువర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి.
ఎదురు కాల్పోల్లో మేజర్ డిఎన్ డోండియాల్, కానిస్టేబుల్ సేవా రామ్, జవానులు అజేయ్ కుమార్, హరిసింగ్లు అమరులయినట్లు గుర్తించారు.
భద్రతా దళాల కాల్పుల్లో పుల్వామా ఉగ్రదాడిలో కీలకపాత్ర పోషించిన జైషే మహమ్మద్ కమాండర్ రషీద్ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది కమ్రాన్ హతమయ్యారు.
సైనికుల దాడిలో హతమైన జైషే మహమ్మద్ కమాండర్ రషీద్ ఘాజీ