అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన గ్రామ వాలంటీర్ల నియామకానికి నిరుద్యోగ యువతీ యువకులన నుండి అనూహ్య స్పందన లభిస్తున్నది. గ్రామ వాలంటీర్ల నియామకానికి ధరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం అర్థరాత్రి 12గంటలతో ముగియనుండగా నిరుద్యోగ యువతీ యువకుల నుండి వచ్చిన స్పందనతో ఈ నెల పదవ తేదీ వరకూ గడువును పొడిగించారు. అదే విధంగా వార్డు వాలంటీర్ల విద్యార్హత డిగ్రీ నుంచి ఇంటర్మీడియట్కు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
రాష్ట్రవ్యాప్తంగా 13,055 గ్రామ పంచాయతీలలో మొత్తం 1,81,885 గ్రామ వలంటీర్ పోస్టులకు శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి 7,82,045 దరఖాస్తులు అన్లైన్లో అందాయి. నిన్న ఒక్క నాడే 96,271 దరఖాస్తులు వచ్చాయి. 7,82,045 దరఖాస్తులలో 6,42,812 దరఖాస్తులను పరిశీలన చేసి, 6,12,750 అర్హమైనవిగా తేల్చారు. కేవలం 30,062 దరఖాస్తులు మాత్రమే తిరస్కరణకు గురవ్వగా వీటిని దరఖాస్తుదారులు మళ్లీ అప్లోడ్ చేసుకునే వెసులు బాటును అధికారులు కల్పించారు. ఈ పోస్టులకు జూన్ 24నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించారు.
ఈ నియామక ప్రక్రియ కోసం మండల స్థాయిలో ఏర్పాటు చేసిన ఎంపిడిఒ, తహశీల్దార్, ఇఒపిఆర్డిలతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటి రోజు వారీగా తమ మండల పరిధిలో అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల మేరకు ఉన్న వాటిని ఇంటర్వ్యూకు అర్హమైనవిగా తేలుస్తున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన ధరఖాస్తుల్లో 1,39,233 దరఖాస్తులను అధికారులు పరిశీలన చేయాల్సి ఉంది.
ముగ్గురు సభ్యుల కమిటీ పరిశీలన అనంతరం తిరస్కరణకు గురైన వాటిని మినహాయించి మిగిలిన దరఖాస్తుదారులందరికీ ఈ నెల 11నుంచి 25వ తేదీ వరకు మండల కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.