Galla Jayadev: టీడీపీకి ఉన్న ముగ్గురు లోక్ సభ సభ్యుల్లో ఇప్పటికే ఒకరు (విజయవాడ ఎంపీ కేశినేని నాని) పార్టీని వీడి వైసీపీలో చేరగా, మరో ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. క్రియాశీల రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్లు గల్లా జయదేవ్ ప్రకటించారు.
చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు, నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దంగా లేరని ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ తరుణంలో ఇవేళ గల్లా జయదేవ్ గుంటూరులో కార్యకర్తల సమావేశం, ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి రెండు సార్లు గెలిపించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన గల్లా జయదేవ్ .. ముందుగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో కీలక ప్రకటన వెలువరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదన్నారు. అయితే తాజా నిర్ణయం తాత్కాలికమేనని చెప్పారు. వనవాసం తర్వాత శ్రీరాముడు, అజ్ఞాతవాసం తర్వాత పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు.
ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల తన పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నానన్న భావన ఉందన్నారు. మళ్లీ పోటీ చేసినా గెలుస్తానని నమ్మకం ఉన్నా ప్రస్తుతం రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రెండేళ్ల క్రితం నా తండ్రి వ్యాపారాల నుండి రిటైర్ అయ్యారనీ, అప్పటి నుండి ఇటు రాజకీయాలు, అటు వ్యాపారం రెండింటినీ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమవుతోందన్నారు. అందుకే రాజకీయాలను వదిలివేస్తున్నట్లు తెలిపారు.
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముఠా రాజకీయాల నుండి దూరంగా ఉన్న తాను స్థానిక నాయకులు, ప్రజలను నమ్ముకొని ముందుకు వెళ్లినట్లుగా చెప్పారు. రాష్ట్ర సమస్యలు, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో పోరాడినట్లుగా తెలిపారు. రాజధానిగా అమరావతికే మద్దతు ఇస్తానని తెలిపారు. గతంలో ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన సమయంలో పార్టీ గొంతు తాను వినిపించాననీ, దాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ కేసుల్లో ఈడీ తనను రెండు సార్లు పిలిచి విచారించిందన్నారు. తన వ్యాపారాలు అన్నీ నిఘా పరిధిలో ఉన్నాయనీ, సీబీఐ, ఈడీ తన ఫోన్ లు ట్యాప్ చేస్తున్నాయంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు గల్లా జయదేవ్.
AP TET: ఉపాధ్యాయ అభ్యర్ధులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్