Heavy Rain Alert: పశ్చిమ మద్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..ఈ నెల 26 (రేపు) వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తొంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ సహా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల్లో జల కళ సంతరించుకుంది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాంతో ఆయా చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములతో పాటు గంటకు 40 నుండి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
నిన్న హైదరాబాద్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రహదారులపై భారీగా నీరు ప్రవహరిస్తుండటంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేయడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమైయ్యారు. ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్ల నుండి అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉండవచ్చని అధికారులు తెలిపారు. హైదరాబాద్ కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా, వరంగల్లు, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యపేట, జనగామ్, సిద్దిపేట, జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మెడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తెలంగాణ పరిస్థితి ఇలా ఉండగా..
ఏపి వ్యాప్తంగా మరో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని ఏపి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సైతం దృవీకరించింది. ఐఎండీ అంచనా ప్రకారం పశ్చిమ మద్య మరియు అనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడించారు. బుధవారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడుతున్నట్లు తెలిపారు. అ తర్వాత ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ – వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అయిదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపారు. బుధవారం అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు, గురువారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మిగిలిన చోట్ల ఒక మోస్తరు వర్షాలు పడనున్నట్లు వివరించారు.
బుధవారం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రం భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గురువారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రం భారీ నుండి అతి భరీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పని చేసే కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని సూచించారు.