మధ్యప్రదేశ్లో మరో నయా స్కామ్ బయటపడింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్జీఎన్ఆర్జీఈ) లోని లోసుగులను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు దోపిడీ దందా కొనసాగిస్తున్నారు. పేదలకు, గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడానికి ఉద్దేశించిన ఈ పథకంలో బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకునే, జక్వేలిన్ ఫెర్నాండెజ్ల పేర్లతో పాటు మరింత మంది బాలీవుడ్ నటులు, భారీగా ఆస్తులు ఉన్నవారి పేర్లు ఉండటమే కాకుండా.. ఇది వరకే వారు పని చేసినట్టుగా చూపుతూ భారీ స్థాయిలో సొమ్మును తీసుకున్నారు. మధ్య ప్రదేశ్లోని జిర్నియా జిల్లా పిపర్ ఖేడా గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకున్న ఈ నయా దోపిడీ తాజాగా వెలుగులోకి వచ్చింది.
పిపర్ ఖేడా గ్రామ పంచాతయతీ సర్పంచ్, కార్యదర్శి ఇద్దరు కలిసి బాలీవుడ్కు చెందిన దీపికా పదుకునే, జక్వేలిన్ ఫేర్నాండెజ్ వంటి ప్రముఖ నటులతో పాటు ఇతర నటులు ఫొటోలను ఉపయోగించిన నకిలీ కార్డులను సృష్టించారు. అలాగే, గ్రామంలోని పురుషులు, మహిళలందరి పేరిట కార్డులు జారీ చేశారు. పలు జాబ్ కార్డులపై వేరే వ్యక్తుల ఫొటోలు ముద్రించాడు. ఈ కార్డులుతో వారందరూ పనికి వచ్చినట్టుగా రికార్డుల్లో నమోదు చేశారు. ఇలా లక్షల రూపాయలను సర్పంచ్, కార్యదర్శిలు ఇద్దరూ కలిసి నొక్కేశారు. వీరికి ఉపాధి హమీ పథకం స్థానికి అసిస్టెంట్లు సైతం సహకరించారు. అయితే, అసలైన లబ్ధిదారులకు అందాల్సిన వేతనాలు అందకపోవడంతో ఈ విషయం బట్టబయలైంది.
పలు జాబ్ కార్డులను పరిశీలించగా జాబ్కార్డు పై దూబే అనే వ్యక్తి పేరు ఉండగా.. దానిపై దీపికా ఫొటోను ముద్రించారు. అలాగే, సోనూ అనే పేరు ఉన్న కార్డుపై జక్వేలిన్ ఫొటో ఉంది. అసలు పేరు ఉన్న వ్యక్తులు ఇప్పటివరకూ ఉపాధి హామీ పనికి వెళ్లలేదని చెప్పడం గమనార్హం. ఇలాంటి కార్డులపై ఇప్పటివరకూ లక్షల్లో సొమ్మును మింగేశారు. ఇలాంటి కార్డులు చాలానే ఉన్నాయి. అలాగే, 50 ఏకరాల భూమి ఉన్న వారికి కూడా కార్డులు ఉండటం వీరి అక్రమాలకు అద్దం పడుతున్నది. దీనిపై జిల్లా పంచాయతీ సీఈవో గౌరవ్ మాట్లాడుతూ.. ప్రముఖుల ఫొటోలతో ఉన్న పలు కార్డులను గుర్తించామనీ, వీరి పని చేసినట్టుగా పేర్కొంటూ వేతనాలు సైతం తీసుకున్నట్టుగా గుర్తించమన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామనీ, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.