YS Jagan – KCR: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఒక విషయంలో ఒకే పంథా అవలంబిస్తున్నారు.రాష్ట్ర ప్రజలపై పన్నులు వేసే ఈ ఇద్దరు పాలకులు తాము మాత్రం అవి కట్టకుండా కాలం వెళ్లదీస్తున్నారు.అయితే ఈ విషయం మీడియాలో రావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.వెంటనే తన నివాసానికి కట్టాల్సి ఉన్న ఇంటి పన్నులు ఆయన వడ్డీతో సహా చెల్లించేశారు.కాని జగమొండి అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు.నిజం చెప్పాలంటే ఆయనను ఇంటి పన్ను బకాయిలు కట్టమని అడిగే సాహసం జీహెచ్ఎంసీ అధికారులకు లేదు.
విషయం ఏమిటంటే!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బేగంపేటలోని ప్రగతి భవన్ ని తన అధికారిక నివాసంగా చేసుకున్నారు.కుటుంబంతో సహా అక్కడే ఉంటున్నారు.ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలో తన భార్య భారతీరెడ్డి పేరుతో వున్న ఇంటిలో నివసిస్తున్నారు.దీనిని కూడా సీఎం అధికారిక నివాసం గానే పరిగణిస్తున్నారు.కానీ ఆ మేరకు రికార్డులు తయారు కాలేదు.దీంతో ఆయన ఇంటి పన్ను బకాయిపడినట్లయింది.అయితే సీఎం అయినా.. మరొకరైనా వారు ఉండే ఇళ్లకు ఆయా మున్సిపాలిటీలు లేదా కార్పోరేషన్లు విధించే ఇంటి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రం పన్నులు కట్టడం లేదు.దీంతో జగన్ మోహన్ రెడ్డిపై ఒంటికాలిపై లేచే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించగా సీఎంవో కార్యాలయం వెంటనే స్పందించి తాడేపల్లి మున్సిపాలిటీకి బకాయిలు చెల్లించేసి రసీదు తీసుకుంది.ఇప్పుడు జగన్ తాడేపల్లి నివాసాన్ని సీఎం అధికారిక నివాసంగా అధికారులు ప్రకటించారు.
కెసిఆర్ ది అదే కేసు!అయినా అడిగేవాడేడి?
ఆంధ్రప్రదేశ్ సీఎం ఇంటి పన్ను బకాయిలు కట్టగానే ఫోకస్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మీదకు మళ్లింది.కేసీఆర్ కూడా తన అధికారిక నివాసం ప్రగతి భవన్ ఇంటి పన్నులు కట్టడం లేదని అక్కడ మీడియాలో వార్తలు మొదలయ్యాయి.గత నాలుగేళ్లుగా కెసిఆర్ చెల్లించాల్సిన బకాయిలు 18లక్షల వరకు ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు లెక్కలు వేశారు.కానీ ఆయనను అడిగే సాహసం ఎవరూ చేయలేదు.నిజానికి ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి ప్రభుత్వ ఖజానా నుండి ఇలాంటి పన్నులు చెల్లించే సౌలభ్యం ఉంది.జేబులో డబ్బు పైసా ఖర్చు పెట్టక్కర్లేదు.అయినా ముఖ్యమంత్రి కార్యాలయం అసలు ఆ ఊసే పట్టించుకోలేదు.సామాన్యుడు వెయ్యి రూపాయలు బకాయి పడ్డా ముక్కుపిండి వసూలు చేసే జిహెచ్ఎంసి అధికారులు ప్రభువు సేవలో తరిస్తూ ఆయన పన్నుల బకాయిలను అటకెక్కించారు. పోతే ఇక్కడ జగన్ చేత పన్ను బకాయిలు కట్టించానని చంకలు గుద్దుకుంటున్న ఆంధ్రజ్యోతి అదేపని తెలంగాణలో చేసి చూపిస్తే బాగుంటుంది కదా?