అమరావతి, మార్చి 29: కోర్టు తీర్పు నేపథ్యంలో ఈసి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డిజి ఎబి వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
శుక్రవారం ప్రభుత్వం ఎబి వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ జివో ఆర్టి నెం.750 విడుదల చేసింది. ఎన్నికలకు సంబంధించిన విధులకు దూరంగా ఉంచాలని ఉత్తర్వుల ో పేర్కొంది.
రెండు రోజుల క్రితం ఈసి ఉత్తర్వుల మేరకు ఇంటెలిజెన్స్ డిజి వెంకటేశ్వరరావుతో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పిలను బదిలీ చేసిన ప్రభుత్వం ఆ మరుసటి రోజే ఇంటెలిజెన్స్ డిజి ఎన్నికల సంఘం పరిధిలోకి రారని పేర్కొంటూ ఆయన బదిలీ నిలుపుదల చేసి కేవలం కడప, శ్రీకాకుళం ఎస్పిలను బదిలీ చేస్తూ మరో జివో ఇచ్చిన విషయం తెలిసిందే.
ఐపిఎస్ల బదిలీలకు సంబంధించి ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాద ప్రతిపాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఎన్నికల సంఘం ఆదేశాలలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రభుత్వం తాజాగా ఇంటెలిజెన్స్ డిజి వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.