Badvel Bypoll: ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం అత్యంత సహజం.దీనినే సానుకూల ప్రజాస్పందన అనుకుంటే అవివేకమని ఆంధ్రప్రదేశ్ చరిత్ర చెబుతోంది. 2014-2019 మధ్య టిడిపి అధికారంలో ఉండగా రాష్ట్రంలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీయే గెలిచింది.
ఆ ఉప ఎన్నికల్లో గెలుపు టీడీపీదే!
2014 ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యేలు తంగిరాల ప్రభాకరరావు(నందిగామ) పసుపులేటి వెంకటరమణ (తిరుపతి)మృతి చెందగా ఉపఎన్నికలు అవసరమయ్యాయి.ఆ ఎన్నికల్లో ప్రభాకర్ రావు కుమార్తె తంగిరాల సౌమ్య నందిగామలోనూ,వెంకటరమణ భార్య పసుపులేటి సుగుణమ్మ తిరుపతిలోనూ గెలుపొందారు.ఇంకో విచిత్రమైన విషయమేమిటంటే 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీ అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు.అయితే ఎన్నిక వాయిదా పడకుండా కొనసాగడంతో ఆమె విజయం సాధించారు.తదుపరి ఆమె స్థానంలో వైసీపీ అభ్యర్థి గా భూమా అఖిలప్రియ నిలబడి విజయం సాధించారు.వేర్వేరు కారణాల వల్ల ఈ ఉప ఎన్నికల్లో టిడిపి, వైసిపిలు పరస్పరం పోటీకి దిగలేదు.
నంద్యాలలో గెలిచి నామరూపాలు లేకుండా పోయిన టిడిపి
ఇకపోతే వైసిపి నుండి నంద్యాల్లో గెలుపొందిన భూమా నాగిరెడ్డి తదుపరి టిడిపిలో చేరారు.ఆ తర్వాత ఆయన మృతి చెందినట్టు నంద్యాల ఉప ఎన్నిక జరపాల్సి వచ్చింది.నంద్యాల ఉప ఎన్నికలో మాత్రం టీడీపీ, వైసీపీలు బరిలోకి దిగాయి.దీనినో ప్రతిష్టాత్మక ఎన్నికగా భావించి ఆ రెండు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డాయి.ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు,ప్రతిపక్ష నేత అయిన జగన్ మోహన్ రెడ్డి నంద్యాలను కేంద్ర స్థావరంగా చేసుకుని అన్ని రకాల అస్త్రశస్త్రాలతో పోరాడారు.అయితే అక్కడ టీడీపీ విజయం సాధించింది.దీంతో తమ పార్టీకి తిరుగులేదని టిడిపి నేతలు సంబరాలు చేసుకుంటే వైసిపి కొద్దిగా డీలా పడిన మాట వాస్తవం.ఆ తర్వాతే జగన్ పాదయాత్ర చేపట్టారు.తదుపరి 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ లేకుండా పోగా వైసిపి 151 సీట్లతో అఖండ విజయం సాధించడం తెలిసిందే.
Badvel Bypoll: వైసీపీ కి ఉప ఎన్నికల్లో దక్కిన ఒక లోక్సభ, ఒక అసెంబ్లీ!
ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటికి రెండు ఉప ఎన్నికలు జరిగాయి.తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో జగన్ వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇటు టిడిపి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ని తిరిగి ఎన్నికల బరిలోకి దింపింది.అలాగే బిజెపి రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ ను పోటీ చేయించింది.రాష్ట్ర మంత్రులు,వైసీపీ ఎమ్మెల్యేలు అంతా తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో మకాం వేసి ఎట్టకేలకు గురుమూర్తిని గెలిపించుకోగలిగారు.తాజాగా బద్వేలు వైసిపి ఎమ్మెల్యే మరణంతో జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో మంగళవారం అఖండ విజయం సాధించారు.
Badvel Bypoll: ఉనికి చాటుకునే ప్రయత్నం చేసిన బిజెపి
బద్వేలు ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయకపోవడంతో బీజేపీయే వైసీపీకి ప్రధాన పోటీదారుగా తయారైంది.అయితే ఏపీలో బీజేపీకి నామమాత్రం బలముండటంతో వైసీపీ గెలుపు నల్లేరుపై నడక అయింది.ఒక లోక్సభ,ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలో వైసీపీ విజయం సాధించడంతో ఆ పార్టీకి తిరుగులేదని అధికార పార్టీ శ్రేణులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నాయి.కానీ చరిత్రను పరికించి చూస్తే ఉపఎన్నికల తీర్పుకు.. సాధారణ ఎన్నికల లో ప్రజానాడికి మధ్య ఏమాత్రం పొంతన ఉండదు.ఈ సత్యం ఇప్పటికే అనేకసార్లు రుజువైంది.వైసీపీ ఈ చరిత్రను తిరగరాస్తుందేమో చూడాలి.