Janasena: జనసేన పోటీ చేసే రెండు స్థానాలను పవన్ కళ్యాణ్ ప్రకటించి టీడీపీ అధినేత చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. జనసేన – టీడీపీ పొత్తులో ఉన్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్షంగా రెండు నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించారు. ఇటీవల రా కదలిరా బహిరంగ సభల్లో పాల్గొన్న చంద్రబాబు ..మండపేట, అరకు నియోజకవర్గాలకు అభ్యర్ధులను వెల్లడించారు. ఇది చంద్రబాబు పొత్తు ధర్మాన్ని విస్మరించడమేనని పవన్ కళ్యాణ్ పేర్కొంటున్నారు. చంద్రబాబు తీరును తప్పుబట్టిన ఆయన .. తానూ రెండు నియోజకవర్గాలను ప్రకటించి చంద్రబాబుకు షాక్ ఇచ్చారు.
శుక్రవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో చంద్రబాబు మండపేట, అరకు అభ్యర్ధులను ప్రకటించడంపై మాట్లాడారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదు కానీ చేశారన్నారు. చంద్రబాబుకు ఒత్తిడి ఉన్నట్లే తనకు కూడా ఒత్తిడి ఉందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ .. రాజోలు, రాజానగరం లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే తాను కూడా రెండు సీట్లు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని టీడీపీ అర్ధం చేసుకుంటుందని భావిస్తున్నానన్నారు.
వాస్తవానికి పవన్ ప్రకటించిన రెండు నియోజకవర్గాలు కూడా జనసేనకు కేటాయించేవే అని భావిస్తున్నారు. ఎందుకంటే .. పవన్ కళ్యాణ్ ఇవేళ రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుంది అని ప్రకటించారు. రాజోలు నియోజకవర్గం గత ఎన్నికల్లో జనసేన గెలుపొందిన సీటే కావడం వల్ల టీడీపీ – జనసేన మధ్య పెద్ద చర్చ ఏమీ లేదని అంటున్నారు. ఇక రాజానగరం విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో జనసేనకు బలమైన క్యాడర్ ఉంది.
ఈ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్ధి అయితే గెలుపునకు ఢోకాలేదని భావిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధికి 27 శాతంకుపైగా ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికలలోనూ జనసేన అభ్యర్ధికి 20వేలకుపైగా ఓట్లు వచ్చాయి. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుండి వరుసగా రెండు సార్లు గెలిచిన పెందుర్తి వెంకటేశ్ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి జక్కంపూడి రాజా చేతిలో దాదాపు 31వేల ఓట్ల తేడజాతో ఓటమి పాలైయ్యారు. ప్రస్తుతం టీడీపీ ఇంత వరకూ ఆ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ చార్జి బాధ్యతలను అప్పగించలేదు. జనసేనకు కేటాయించాలన్న ఆలోచనతోనే ఇన్ చార్జిని టీడీపీ నియమించలేదని అంటున్నారు.
చంద్రబాబు ప్రకటించిన రెండు స్థానాలు మండపేట టీడీపీ సిట్టింగ్ స్థానం, 2009 నుండి ఇక్కడ టీడీపీ వరుసగా విజయం సాదిస్తూ వస్తుంది. ఇక అరకు నియోజకవర్గాన్ని జనసేన ఆశించే పరిస్థితి లేదు. ఇక్కడ వరుసగా 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి విజయం సాధించారు. 2009లో టీడీపీ అభ్యర్ధి కేవలం నాలుగు వందల పైచిలుకు ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో జనసేనకు పెద్దగా క్యాడర్ లేదు.
Republic day: అభినందనీయంగా ప్రభుత్వ సంక్షేమ పాలన – ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్