అదో నిర్మానుశ్య ప్రదేశం… గ్రామీణ ప్రాంతం… పట్టుమని పది మంది కుర్రాళ్ళు లేని ప్రదేశం... కళ్యాణ్ వస్తున్నాడు అంట్రా… కనిపిస్తే పండగే… అని రోడ్డు మీద వేచి చూస్తున్న ఆ యువకుల వద్ద వాహన కన్వాయ్ ఆగింది… చిరుజల్లులు పడుతున్న సమయం అది… వాగులు పొంగుతూ రోడ్డు సైతం కనిపించని వేళ ఆ కన్వయ్ నుంచి తాము ఎదురు చూసే నాయకుడు దిగాడు… కనీసం వాహనం లో నుంచి ఐనా కనిపిస్తాడు అనుకున్న తమ నాయకుడు…. ఆ యువకుల వద్దకు వచ్చాడు.. వారందరిని గుంపుగా చేసి ఆ గుంపులో తాను కూర్చుని మాట్లాడాడు… రోడ్డే సభ ప్రాంగణం అయ్యింది… చుట్టుపక్కల ఉన్న యువతే సభలో అధ్యక్షులు అయ్యారు… కనివినీ ఎరుగని కలయిక ఇది….. జనసేనాని యువత ను కలుసుకున్న తీరు…. రోడ్డు మీదనే వారితో మమేకం అయిన తీరు ఇప్పుడు ముచ్చట గోలిపేలా ఉందని, జనసైనికులు ఆనంద పడుతున్నారు.. నివర్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని కలుపుకునేందుకు నెల్లూరు జిల్లా వచ్చిన ఆయన గూడూరు సమీపంలో రోడ్డుపై ఆగి అక్కడున్న రోడ్లను పరిశీలించి, అనంతరం అక్కడే రోడ్డుపై ఉన్న యువతను కలుసుకున్న తీరు.. వారిని చుట్టే కూర్చోబెట్టుకొని మాట్లాడిన తీరు పట్ల సోషల్ మీడియా లో సంతోషాన్ని పంచుకుంటున్నారు…
ఇదే అసలైన ప్రత్యామ్నాయం
పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు కొత్త రాజకీయాలు అంటే ఇవే. దీనికి పైసా ఖర్చు అక్కర్లేదు. కేవలం సమయం ఉండి ప్రజా సమస్యల మీద పోరాడాలి అన్న భావన ఉండాలి. ప్రజలతో మమేకమై ఎప్పుడు వారి మధ్య తిరగడం నా ఆశ ఆశయం ఉండాలి.. అవి ఉంటే ఈ తరహా రోడ్డుమీదే యువతను ప్రోగు చేసి కొత్త తరహా రాజకీయాలు చేయవచ్చు. దీనికి డబ్బుతో పని లేకున్నా ఓపిక ఓర్పు మార్పు తెచ్చే కసి ఉండాలి. దీన్ని ముందుకు సాగించాలన్న తాపత్రయం కనిపించాలి.
** స్వాతంత్ర సమరంలో మొదట పాలు పంచుకున్న సమయంలో గాని, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తన యాత్ర మొదలు పెట్టినపుడు, బిఎస్పీ మొదలు సమయంలో కాన్షిరాం, తెలుగుదేశం పార్టీ ప్రారంభం సమయంలో ఎన్టీఆర్ సైతం ఇలా రోడ్డు మీద జనాన్ని ప్రోగు చేసి వారితో మమేకమయ్యారు. అంత పెద్ద వారితో పవన్ పోల్చడం సరి కాదు కానీ ప్రస్తుతం పవన్ అనుసరిస్తున్న ఈ తీరు సర్వదా హర్షణీయమే.
** ప్రస్తుతం జనసేన పార్టీ తన ఉనికి కోసం ఆరాటపడుతున్నట్లే కనిపిస్తోంది. పవన్ కు విశేష జనాదరణ ఉన్న దాన్ని ఓట్లుగా మలుచుకో లేకపోయారు. మరోపక్క పార్టీ నేతలు సైతం పార్టీ జనంలో ఉండకపోతే కష్టం అంటూ ఇటీవల పార్టీ సమావేశంలోనే నిర్మొహమాటంగా చెప్పారు. దీంతోనే పవన్ ఆలోచన తీరు మారినట్లు కనిపిస్తోంది. ప్రతి పర్యటనలోనూ యువతను ఎక్కువగా కలుసుకునే పవన్ ఇకమీదట ఇలా ప్రత్యక్షంగా కలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుఫాను వచ్చినప్పుడు పర్యటనకు వెళ్లిన పవన్ ఆ సమయంలోనూ ఇదే తీరున కొంతమంది యువత రోడ్డు పక్కన పోగేసి వారి మధ్యలో తాను కూర్చొని మాట్లాడిన విషయం పాతదే. అయితే అదే తీరును తర్వాత పవన్ కొనసాగించలేకపోయాడు. కేవలం సమావేశాలు, సభ్యులతోనే కాలం గడిచిపోయింది. అయితే ప్రస్తుతం మళ్లీ ఆయన ఆలోచనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.
కొనసాగిస్తారా?
నివర్ తుఫాను ప్రభావ ప్రాంతాల్లో పర్యటన ను పవన్ పార్టీ కార్యకర్తలను కలుసుకునేందుకు ఉపయోగించుకున్నారు. ఇదే తీరును ఆయన కొనసాగిస్తే పార్టీకి మంచి రోజులు మొదలైనట్లే. కార్యకర్తలతో మాట్లాడే సమయంలో సైతం ఆయన దిశానిర్దేశం పెరగాలని కేవలం వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్న తీరుగానే ఆయన ప్రసంగం ఉంటుందనేది మరో ఆరోపణ. దీని సైతం పవన్ అధిగమించి, ఇదే పరిస్థితిలో ప్రజల్లో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసి కమిటీలు నియమిస్తే జనసేన ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా ఎదగడమే కాకుండా, కొత్త తరహా రాజకీయాలతోనే యువతను, తాటస్థులను తన వైపు తిప్పుకోవడం ఖాయం.