Telangana Congress: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య ఇవేళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో వీరు కాంగ్రెస్ తీర్ధం పుచుకున్నారు. వీరికి దీపాదాస్ మున్షీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తొలుత కుమార్తె కావ్యతో కలిసి కడియం శ్రీహరి ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీలతో కొద్ది సేపు సమావేశం అయిన తర్వాత కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.
వరంగల్లు లోక్ సభ స్థానం నుండి పోటీ కోసం కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఈ ప్రతిపాదన రావడంతో .. బీఆర్ఎస్ నుండి వరంగల్ లోక్ సభ అభ్యర్ధిగా పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కావ్య ప్రకటించారు. వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా కావ్య పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా, పెండింగ్ లో ఉన్న నాలుగు లోక్ సభ స్థానాల అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి పార్టీ హైకమాండ్ నేడో రేపో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి పార్టీ హైకమాండ్ నేతలతో ఈ విషయపై చర్చించే అవకాశం ఉంది.
తొలుత కడియం ఫ్యామిలీని కాంగ్రెస్ లోకి తీసుకోవడంపై స్థానికంగా నేతల నుండి నిరసన వ్యక్తం అయ్యినా.. హైకమాండ్ అందరికీ సర్ది చెప్పింది. పార్టీ బలోపేతానికి తీసుకున్న నిర్ణయాలను గౌరవించాలని వారికి చెప్పడం జరిగింది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ 13 మంది అభ్యర్ధులను ప్రకటించింది. ఇవేళోరేపో జరిగే సమావేశంలో నలుగురు ఎంపీ అభ్యర్ధులను ఖరారు చేసే అవకాశం ఉంది కాగా ఖమ్మం ఎంపీ టికెట్ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
ఇక, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కే కేశవరావు చేరికకు మూహూర్తం ఖరారు అయ్యింది. ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుండి కీలక నేతలు, ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు. పలువురు నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరి కొందరు బీజేపీలో చేరి లోక్ సభ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. వరుసగా కీలక నేతలు పార్టీ వీడుతుండటం బీఆర్ఎస్ ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తొంది. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లోనూ అధిక సీట్లు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది.