లక్షలు, కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని చెల్లించని బడా బాబులపై ఉదాసీనంగా వ్యవహరించే బ్యాంకులు సామాన్యులకు మాత్రం చుక్కలు చూపిస్తున్న సంఘటనలు అనేకం కనిపిస్తుంటాయి. వాటిలో ఇదొక ఉదాహరణ. బ్యాంకు అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఒ రైతు కేవలం రూ.3.46 రుణం చెల్లించేందు కు 15 కి.మీ. నడిచి వెళ్లిన వైనం కర్ణాటకలో జరిగింది.
విషయంలోకి వస్తే.. కర్ణాటక లోని శిమోగ జిల్లా బారువ్ గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ.. కెనరా బ్యాంకు నుంచి వ్యవసాయ రుణం తీసుకున్నాడు. ఆ రైతు గ్రామం పశ్చిమ అడవుల్లో ఉంది. సదరు బ్యాంకేమో గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలోని నిత్తూరు టౌన్ లో ఉంది. అతను వ్యవసాయ రుణం కింద బ్యాంకు నుంచి రూ. 35 వేలు తీసుకోగా.. రూ. 32 వేలను ప్రభుత్వం మాఫీ చేసింది. మిగతా మూడు వేల రూపాయలు కొన్ని నెల క్రితం చెల్లించాడు. తన ఋణం తీరిపోయింది ఆ రైతు నిశ్చింతగా ఉన్నాడు. అయితే బ్యాంకు అధికారులు రైతుకు ఫోన్ చేసి తక్షణమే బ్యాంక్ కు వచ్చి రుణం చెల్లించాలని ఆదేశించారు. దీనితో రైతు షాక్ కు గురి అయ్యాడు. వడ్డీ కింద ఎంత ఏసారో ఏమో అని ఆదరాబాదరాగా ఆ రైతు అష్టకష్టాలు పడి బ్యాంక్ కు నడిచి వచ్చాడు. తీరా అక్కడి వెళ్ళాక మీరు చెల్లించాల్సిన రుణం కేవలం 3 రూపాయాల 46 పైసలు మాత్రమే అని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆ రైతుకు చిరెత్తుకొచ్చింది. అప్పటి కప్పుడు ఆ రుణం చెల్లించాడు.
ఈ ఘటనపై కెనరా బ్యాంక్ మేనేజర్ ఎల్ పింగ్వాను మీడియా వివరణ కోరగా.. తమ బ్రాంచిలో ఆడిట్ జరుగుతుండటంతో.. రుణాలు చెల్లించని వారికి ఫోన్లు చేసి చెల్లించమని కోరాము అని తెలిపారు. ఆ రైతు సంతకం కూడా అవసరం ఉన్నది కాబట్టి వెంటనే రావాలని కోరామని చెప్పారు. అయితే బ్యాంకు అధికారుల తీరు పట్ల ఆ రైతు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బ్యాంకు అధికారుల తీరును పలువురు ఆక్షేపిస్తున్నారు.