సహజంగానే ఈ ప్రశ్న మళ్లీ ఇప్పుడు తెరమీదకు వస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలు, ఇటు అప్పటి ముఖ్యమంత్రి కొడుకుగా, ఇటు మరో ఎమ్మెల్యే, సీనియర్ నటుడు బాలయ్యకు అల్లుడుగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ఉన్న లోకేష్ అమరావతి రాజధాని ఉన్న మంగళగిరిలో పోటీ చేసి 5 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇది నిజంగానే లోకేష్ పొలిటికల్ కెరీర్కు పెద్ద మచ్చ అని చెప్పాలి. విచిత్రం ఏంటంటే అసెంబ్లీకి మంగళగిరిలో లోకేష్ ఓడిపోతే అదే మంగళగిరి నుంచి పార్లమెంటుకు మాత్రం జయదేవ్కు మెజార్టీ వచ్చింది.
గత ఎన్నికల్లో లోకేష్ మంగళగిరిలో ఓడిపోయినా కూడా ఐదేళ్లపాటు అక్కడే ఉన్నారు. పార్టీని, కేడర్ను పటిష్టం చేసుకుంటూ వచ్చారు. పైగా కోవిడ్ టైంలో ఆదుకున్నారు. నియోజకవర్గంలో ఎవ్వరికి ఏ పని కావాల్సి వచ్చినా పార్టీలకు అతీతంగా స్పందించారు. తన సొంత నిధులు వెచ్చించి ఎన్నో రహదారులు పూర్తి చేయించారు. ఈ సారి మంగళగిరి ఓటర్లలో కొంత మార్పు అయితే వచ్చింది. దీనికి తోడు రాజధానిని మార్చేయడం.. జగన్ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు తల్లకిందులు అయ్యాయి.
దీనికి తోడు ఇక్కడ వైసీపీ నుంచి రెండుసార్లు గెలిచిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిన అభివృద్ధి అంటూ ఏదీ లేదు. ఈ క్రమంలోనే ఇక్కడ ఓటరు తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మళ్లీ ఇక్కడ నుంచి లోకేష్ పోటీలో ఉండడం ఖరారైంది. లోకేష్ నియోజకవర్గం మారిపోతాడంటూ ప్రచారం జరిగినా, వైసీపీ వాళ్లు కూడా ఇదే ప్రచారం చేసినా లోకేష్ మాత్రం తాను ఓడిన చోటే గెలవాలని పట్టుదలతో ఉన్నారు. దీంతో ఈ సారి లోకేష్ను మళ్లీ ఓడించడానికి జగన్ బీసీ అస్త్రం వాడబోతున్నాడు.
అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే ప్లేసులో గంజి చిరంజీవిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఇప్పుడు లోకేష్ను కొట్టడం గంజి వల్ల కూడా కాదని డిసైడ్ అయిన జగన్ మాజీ ఎమ్మెల్యే బీసీ వర్గానికే చెందిన కాండ్రు కమలను రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తోంది. ఆమె 2009లో కాంగ్రెస్ నుంచి మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా ఆమె మాజీ మంత్రి.. గతంలో మంగళగిరి నుంచే గెలిచిన మరుగుడు హనుమంతరావు వియ్యపురాలు.
ఈ క్రమంలోనే ఆమెను పోటీలోకి దింపతే సామాజిక సమీకరణలు, బంధుత్వాలు కలిసి రావడంతో పాటు ఈ సారి కూడా లోకేష్కు చెక్ పెట్టినట్టు అవుతుందని జగన్ లెక్కలు వేస్తున్నారు. ఏదేమైనా ఈ సారి లోకల్, బీసీ అస్త్రంతో లోకేష్ను ఓడించేందుకు జగన్ వ్యూహాలు పన్నుతున్నట్టే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం పార్టీ వీడిన ప్రస్తుత ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని సైతం తిరిగి పార్టీలోకి తీసుకురావడం కూడా ఈ వ్యూహంలో భాగమే అంటున్నారు.