ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో రోజు రోజుకీ వివాదాలు పెరిగిపోతున్నాయి. టీటీడీపై అన్యమత ప్రచారం బలంగా వస్తూ ఉంటుండటం.. వాటిని జగన్ సర్కార్ విచారణ జరిపి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపడం జరుగుతూనే ఉంది! ఆ సంగతులు అలా ఉంటే తాజాగా మరో వివాదం వచ్చిపడింది. అదేమిటంటే… టీటీడీ నుంచి వచ్చిన పోస్టులో “సప్తగిరి” పత్రికతో పాటు అన్యమత సువార్త పుస్తకం కూడా ఒకే కవర్ లో రావడం!
అవును… గుంటూరులో ఓ వ్యక్తికి టీటీడీ సప్తగిరి పత్రికతోపాటు అన్యమత సువార్త పుస్తకం ఈనెల 6న పోస్టులో వచ్చిందని ప్రచారం జరిగింది. దీంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. పోలీసు విచారణకు ఆదేశించింది. దీంతో గుంటూరుకు చేరుకొన్న తిరుపతి పోలీసులు.. మల్లికార్జునపేటలోని సప్తగిరి పత్రిక చందాదారుడు విష్ణు నివాసంలో విచారణ చేశారు. ఇదే క్రమంలో పోస్ట్ మ్యాన్ ను కూడా విచారించారు! బాధ్యులపై చర్యలు తప్పవని తెలిపారు!
ఆ సంగతులు అలా ఉంటే… ఈ వ్యవహారం కూడ రాజకీయ రంగు పులుముకుంది! కచ్చితంగా ఈ పనిని టీడీపీ పైనా, ప్రభుత్వం పైనా బురదజల్లడానికి ఎవరో కంకణం కట్టుకుని చేసినట్లుగానే ఉందని వైకాపా నేతలు చెబుతున్నారు. లేకపోతే అన్ని వేలమందికి రాని అన్యమత పుస్తకం… కేవలం ఒకరి పోస్టులో మాత్రమే రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఈ వివాదంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. సప్తగిరి పత్రికతోపాటు అన్యమత పుస్తకాలు కూడా పంపుతున్నారన్నది శుద్ధ అబద్దమని.. దీనివెనుక కచ్చితంగా కుట్ర దాగుందని తాను నమ్ముతున్నానని.. విచారణ జరిపిస్తామని తెలిపారు.