కోల్కత్తా: ఎండ వేడిమితో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేక నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఎంత ఎండ ఉన్నా ఎన్నికల సమయం కాబట్టి నాయకులకు ఇక్కట్లు తప్పట్లేదు. అయితే పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక ప్రజా ప్రతినిధి మాత్రం వినూత్నంగా అలోచించి ప్రచారంలో దూసుకుపోతున్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపి అభిషేక్ బెనర్జీ చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
అభిషేక్ పోటీ చేస్తున్న డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో టిఎంసి కార్యకర్తలు ఆయన విగ్రహాన్ని ఓపెన్ టాప్ జీప్లో నిలబెట్టి ప్రచారం చేస్తున్న ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. చేతులు కట్టుకుని నిలబడినట్టుగా ఉన్న అభిషేక్ విగ్రహానికి పార్టీ కార్యకర్తలు పూలదండలు వేసి, నినాదాలు చేస్తూ ప్రచారం చేస్తున్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది.
రిషి బాగ్రీ అనే వ్యక్తి ఈ వీడియోను ట్వీట్ చేయగా రాజ్యసభ సభ్యుడు స్వాపన్ దాస్ గుప్తా షేర్ చేశారు. ఎండ వేడిమి తట్టుకోలేక టిఎంసి డైమండ్ హార్బర్ అభ్యర్థి, మమతా మేనల్లుడు ఒక కొత్త పరిష్కారాన్ని కనుగొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయనకు బదులు ఆయన విగ్రహాన్ని వాడుతున్నారని రిషి బాగ్రీ ట్వీట్ చేశాడు.
খোকা ভগবানের জয় https://t.co/YU4rIjeB1c
— Swapan Dasgupta (@swapan55) April 27, 2019