ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన మంగళగిరి నియోజకవర్గ కీలక నేత గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంజి చీరంజవి దుశ్సాలువాతో సీఎం జగన్ ను సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.
గంజి చిరంజీవి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి కేవలం 12 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు. ఆ తరువాత గంజి చిరంజీవి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున నారా లోకేష్ పోటీ చేయగా, ఆయన వెంట నడిచారు. గత కొద్ది నెలలుగా టీడీపీపై అసంతృప్తితో ఉన్న గంజి చిరంజీవి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళగిరి నియోజకవర్గంలో బలమైన బీసీ నేతగా ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి, నారా లోకేష్ కు గట్టి దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో గంజి చిరంజీవిపై వైసీపీ దృష్టి సారించింది. దీంతో ఆయన వైసీపీ లో చేరారు.
వైసీపీ లో చేరిన సందర్భంగాా గంజి చిరంజీవి టీడీపీ పై విమర్శలు గుప్పించారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీలో బీసీలకు గౌరవం లేదని విమర్శించారు. నిరంతరం అవమానాలకు గురి చేస్తూ బీసీలను ఏమి ఉద్దరిస్తారని ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. టీడీపీలో పెత్తనం అంతా ఒక సామాజిక వర్గానిదేనని ఆయన ఆరోపించారు. సీఎం వైెఎస్ జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు. అణాగారిన వర్గాల అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశేష కృషి చేస్తొందని గంజి చిరంజీవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంఎల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొన్నారు.