పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచే ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అత్యంత జాగ్రత్తల నడుమ ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వరకూ అన్ని రోజులపాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈసారి సమావేశాల్లో 47 అంశాలపై సభ్యులు చర్చించబోతున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 45 బిల్లులతో పాటు రెండు ఆర్థిక అంశాలు ఉన్నాయి.
మఖ్యమైన అంశాలు ఇవీ..
11 ఆర్డినెన్సుల స్థానంలో 11 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందుకు విధి విధానాలనూ రూపొందించింది. ఇందులో ప్రధానంగా రైతులు పండించే ఉత్పత్తులకు వాణిజ్య సౌకర్యం కల్పించే బిల్లు, ధరల భరోసా, వ్యవసాయ సేవల బిల్లు, అత్యవసర సరకుల చట్ట సవరణ సహా పలు ప్రధానమైన బిల్లులు ఉన్నాయి. ఇవే కాకుండా పెండింగ్లో ఉన్న పలు బిల్లులను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటితోపాటు పురుగుల మందుల నిర్వహణ బిల్లు, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోథెరపీ, కంపెనీల చట్ట సవరణ బిల్లు, ఎయిర్క్రాఫ్ట్ చట్ట సవరణ వంటి పలు బిల్లులు కూడా ఉన్నాయని.. ఇవన్నీ ఎంతో ముఖ్యమైనవని తెలిపింది.
ఎప్పుడూ లేని విధంగా సభల నిర్వహణ..
నేటి నుంచి నిర్విరామంగా అక్టోబర్ 1 వరకు మొత్తం 18 రోజుల పాటు ఉభయసభలు భేటీ కానున్నాయి. ఎంపీలందరికీ కోవిడ్-19 కిట్లలో భాగంగా మాస్కులు, శానిటైజర్లు ఇవ్వనున్నారు. పత్రాలకు అల్ట్రా వైలట్ కిరణాలతో శుద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా ఉభయ సభల్లో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఒక్కో సభకు కేవలం నాలుగు గంటలే సమయం కేటాయించారు. లోక్ సభ.. మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 7వరకూ.. రాజ్యసభ.. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 1వరకూ.. సభలు జరుగనున్నాయి.