అల్లు అర్జున్ కు, ఆయన ఫ్యాన్స్కు అల వైకుంఠపురంలో మూవీ మంచి కిక్కు ఇచ్చింది. అదే జోష్లో వరసగా సినిమాలను లైన్ లో పెట్టాడు. షూటింగ్స్ కరోనా వల్ల పోస్ట్ పోన్ అయ్యాయి. లేదంటే ఈ పాటికి ఏదో ఒక సినిమా విడుదలకు సిద్దం అవుతుండేది. ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్లో ఎక్కువగా నానుతున్న చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని, మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇందులో హీరోయిన్ గా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. కాగా ఇదివరకే విడుదలైన ‘పుష్ప’ ఫస్ట్ లుక్ లో బన్నీ ని చూస్తుంటే మొరటుగా ఊర మాస్ క్యారెక్టర్ పోషిస్తున్నాడని అర్థమవుతుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా అడవుల్లో జరుపుకోవాల్సి ఉంది. దీని కోసం కేరళ అడవుల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేయగా కరోనా వచ్చి బ్రేక్స్ వేసింది. దీంతో గత ఆరు నెలల నుండి షూటింగ్ చేయడం సాధ్యపడలేదు. అయితే ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ‘పుష్ప’ కూడా త్వరలోనే సెట్స్ లో అడుగుపెడతాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ ఇప్పుడు బన్నీ లొకేషన్స్ సెర్చ్లో ఉన్నారనే ఫోటోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
ఇకపోతే బన్నీ ఆదిలాబాద్తో పాటు మహారాష్ట్రకు చేరుకుని చిత్ర షూటింగ్ సంబంధించి లొకేషన్స్ సెర్చ్ చేస్తున్నారట. ఇతను ఒక్కడే కాదు బన్నీ కుటుంబ సభ్యులు, పుష్ప మూవీ యూనిట్ కూడా వెంటే ఉన్నారట. కాగా శనివారం కుంటాల జలపాతంను సందర్శించిన బన్నీ ఇప్పుడు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యంలో పర్యటిస్తున్నారట. అంతే కాకుండా కుంటాల జలపాతం వద్ద, తిప్పేశ్వర్ అభయారణ్యంలో కూడా షూటింగ్ కి అనువైన లొకేషన్స్ చూస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి ‘పుష్ప’ చిత్రాన్ని స్పీడ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బన్నీ, చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.