స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఎన్నో అంచనాలు.. హడావిడి ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ తమ హంగామాను ధియేటర్ల వద్ద ఆకాశాన్నంటేలా చేస్తారు. ఓపెనింగ్స్ అదిరిపోతాయి. బిజినెస్ వర్గాలు కొత్త లెక్కలకు సిద్ధంగా ఉంటాయి. ఈ హంగామా దక్షిణాది పరిశ్రమలో ఎక్కువ. మరీ ముఖ్యంగా తెలుగు, తమిళ సినిమాల్లో మరీ ఎక్కువ. ఇతర హీరోల రికార్డులను తమ హీరో సినిమా బద్దలు కొట్టాలనే ఆశలు, అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అంతటి క్రేజ్ ఉన్న హీరోల్లో తమిళంలో విజయ్ ఒకరు. రజినీకాంత్ తర్వాత ఆస్థాయి ఇమేజ్ విజయ్ సొంతం. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విజయ్ నటించిన మాస్టర్ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే.. ఈ సినిమాకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 50 శాతం ఆక్యెపెన్సీతో ధియేటర్లకు అనుమతులు వచ్చాయి. అయితే.. మాస్టర్ భారీ బడ్జెట్ నేపథ్యంలో ఈ సినిమాకు 100 శాతం ఆక్యుపెన్సీ ఇవ్వాలని ఇటివల విజయ్ తమిళనాడు సీఎంను కలిసి కోరారని వార్తలు వచ్చాయి. ఇందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సంతోషంలో ఉన్న టీమ్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెనక్కు తీసుకోవాలంటూ ఆదేశించింది. ధియేటర్ల పర్మిషన్లు రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమే అయినా.. కరోనా నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించడమే అవుతుందని తెలిపింది. దీంతో మాస్టర్ 50 శాతం ఆక్యుపెన్సీతోనే విడుదలవుతోంది. అయితే.. ఇందులో రాజకీయ కోణం ఉందనే వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
2017లో విజయ్ నటించిన మెర్సల్ లో కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీపై ఓ సీన్ ఉంది. ‘7శాతం జీఎస్టీ ఉన్న సింగపూర్ లో ప్రజలకు నాణ్యమైన వైద్యం, భరోసా ఉంది. 28 శాతం జీఎస్టీ ఉన్న భారత్ లో ఇప్పటికీ ప్రజలకు సరైన వైద్యం అందటం లేదు’ అని. అప్పట్లో ఈ డైలాగ్ పై తమిళనాడు బీజేపీ మాత్రమే కాదు.. కేంద్ర ప్రభుత్వం సైతం ఆగ్రహం వెలిబుచ్చింది. దీంతో ఆ డైలాగ్ ను మ్యూట్ చేసారు. తర్వాత బిగిల్ సినిమా కలెక్షన్లపై ఏకంగా విజయ్, నిర్మాత ఇళ్లపై దాడులు నిర్వహించారు. భారీ నగదును స్వాధీనం చేసుకున్నారన్న వార్తలూ వచ్చాయి. ఇప్పుడు మాస్టర్ కు 100 శాతం ఆక్యుపెన్సీ పర్మిషన్ ను అడ్డుకుంది. నిజానికి రాష్ట్రాన్ని అట్టడుకించేసిన కరోనా కేసుల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారి తీసింది. కేంద్రం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టడంతో హర్షం వ్యక్తమైంది.
విజయ్ మాత్రమే కాదు.. బీజేపీతో సూర్య, అజిత్, కమల్ హాసన్ కు కూడా తగాదాలు ఉన్నాయి. ఆమధ్య న్యూ ఎడ్యుకేషన్ పాలసీపై, నీట్ పై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద మెరిట్ విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని బహిరంగంగానే తన నిరసన తెలిపాడు. అజిత్ ఫ్యాన్స్ ఆమధ్య కొందరు బీజేపీలో చేరారు. అజిత్ బీజేపీకి అనూకలమనే సంకేతాలు వచ్చినట్టైంది. దీంతో బీజేపీలో చేరిన వారు నా ఫ్యాన్స్ కాదని అన్నాడు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని కూడా అన్నాడు. ఇక కమల్ హాసన్ అయితే నాధూరామ్ గాడ్సేను తొలి హిందూ తీవ్రవాది అన్నాడు. ఇవన్నీ బీజేపీ అగ్రనాయకత్వానికి కంటగింపుగానే మారాయి.
ఇలా తమిళ హీరోలు తమకు తెలీకుండానే బీజేపీతో కయ్యం పెట్టుకున్నారు. వీరిలో విజయ్ కే ఎక్కువగా దెబ్బ తగిలింది. గతంలో వ్యవస్థల్లోని లోపాల్ని సినిమాల్లో చూపిస్తే.. ప్రభుత్వం వ్యవస్థలో మార్పులు తెచ్చేది. కానీ.. పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా డైలాగులు వేసినా, సన్నివేశాలు చూపినా, టైటిల్ పెట్టినా వివాదం అవుతున్నాయి. తెలుగు, తమిళంలో సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఎక్కువ. సినిమాల ద్వారా ప్రభుత్వ ప్రచారాలకు Ok గానీ.. విమర్శలకు not Ok. ప్రస్తుతం విజయ్ సినిమాకు కేంద్రం అడ్డు చెప్పడం నిజంగా ప్రజా క్షేమమే అయినా.. ప్రభుత్వంతో విజయ్ కు ఉన్న వైరం దృష్ట్యా కక్షసాధింపులా ఉందని చెప్పాలి. ఏదేమైనా అధికారపక్షంతో కొర్రీలు తగనివే.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!