వైసిపి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా లేదు. అతను పార్టీపై మరియు పార్టీ అధినేత జగన్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సమాధానంగా నిన్న పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి అతనికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
కృష్ణంరాజు వివరణను ఏడు రోజుల లోగా ఇవ్వాలని వైసీపీ పార్టీ తరఫున షోకాజ్ నోటీసులు జారీ చేయగా…. ఇప్పుడు రాజుగారు ఒకేసారి పార్టీ విధివిధానాలను నిలదీయడం మొదలుపెట్టారు. అసలు విజయసాయిరెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో షోకాజ్ నోటీసులు జారీ చేయడానికి అతనికి ఆ హోదా ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం అసలు అతనిని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఎప్పుడు పరిగణించింది అని ప్రశ్నించారు.
అంతేకాకుండా క్రమశిక్షణా సంఘం లో జరిగిన చర్చకు అనుగుణంగా కృష్ణంరాజు కి షోకాజ్ నోటీసులు జారీ చేశామని వైసిపి వర్గాలు చెబుతుండగా… సదరు క్రమశిక్షణ సంఘం సభ్యులు ఎవరిని… అసలు అటువంటి సంఘమే లేదు అని… ఉంటే ఎన్నికల సంఘం నుండి గుర్తింపు పొంది ఉండాలని ఎంపీ రాజు గారు ఎద్దేవా చేశారు.
లేదా… పార్టీలో ఉన్న బైలాస్ ద్వారా తనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అయితే అదే న్యాయ సూత్రాలను అనుసరించి క్రమశిక్షణ సంఘం లో చర్చ ఎన్ని నిమిషాలు జరిగిందన్న విషయం కూడా తెలుసుకునే అధికారం తనకు ఉందని కృష్ణంరాజు అడ్డం తిరిగాడు. అంతెందుకు అసలు తనకు నోటీసులు జారీ చేసే సమయానికి కూడా క్రమశిక్షణా సంఘం అన్నదే లేదని అన్నారు.
చివరికి రాజు గారి వాదన ఏమిటంటే… వైసిపి పార్టీ తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి ఎటువంటి అధికారం లేదట. రాజు గారు అసలు విజయసాయిరెడ్డి ఎలా తనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారని ప్రశ్నించడం ఇక్కడ గమనించాల్సిన విషయం.