పొత్తుల్లో భాగంగా బీజేపీకి త్యాగాలు చేస్తున్న టీడీపీ, జనసేనలు.. తాజాగా మరో కీలకమైన సీటును కూడా వదులుకునే పరిస్థితి వచ్చింది. దీంతో ఇటు జనసేన, అటు టీడీపీలలో మరోసారి రగడ తెరమీదికి వస్తోంది. అదే విజయవాడ పశ్చిమ సీటు. వాస్తవానికి ఇక్కడ నుంచి జనసేన నేత పోతిన వెంకట మహేష్ పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. దీంతో టీడీపీ తన వారిని బుజ్జగించి.. ఒప్పించింది అయితే.. అనూహ్యంగా ఈ సీటు కోసం బీజేపీ పట్టుబట్టినట్టు పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది.
కానీ, ఈ సీటుపై జనసేన కీలక నేత మహేష్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఈ స్థానాన్ని బీజేపీకే కేటాయిస్తారా లేక జనసేన అభ్యర్థినే బరిలోకి దింపుతుందా అనే అంశం తేల్చాల్సి ఉంది. ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా పోతిన మహేష్ పేరు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని మారిస్తే.. జనసేన-టీడీపీ వర్గాలు కలిసి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
జనసేన ఇక్కడ వెనుకంజ వేసే పరిస్థితుల్లో పార్టీ శ్రేణుల్లోనూ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ స్థానం బీజేపీ ఖాతాలో పడితే ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. విజయవా డ సెంట్రల్ ఎమ్మెల్యే, వైసీపీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు బీజేపీ తీర్థం పుచ్చుకొని పశ్చిమ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. వన్టౌన్ బ్రాహ్మణ వీధికి చెందిన ఎన్నారై గొలగాని రవికృష్ణ ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన పేరు కూడా బీజేపీ తరపున వినిపిస్తోంది.
అయితే. టికెట్ ఎవరికి ఇచ్చినా.. ఇక్కడ జనసేన, టీడీపీలు సంయుక్తంగా పనిచేయాలి. కానీ, ఇలా ఎన్నికలకు ముందు కీలకమైన నియోజకవర్గంలో పోరు పెట్టుకుంటే.. అంతిమంగా వైసీపీకి మేలు చేసినట్టే అవుతుందన్నది పరిశీలకుల అంచనాగా ఉంది. మరి ఏం చేస్తారోచూడాలి. ఇదిలావుంటే, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మొత్తం 14 స్థానాలకు 10 టీడీపీ తన అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పశ్చిమ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ స్థానాలను జనసేనకు కేటాయించారు. అయితే, అనూహ్యంగా సీన్ మారడంతో పశ్చిమ ఏం చేస్తారనేది చర్చ. చూడాలి ఏం జరుగుతుందో.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!