నెల్లూరు జిల్లాకు చెందిన ఒక పైసా వసూల్ ఎమ్మెల్యేతో వైసీపీకి ఇరకాటం వచ్చిపడింది.బహిరంగంగానే అ అధికార పార్టీ ఎమ్మెల్యే కౌంటర్ తెరిచి మరీ ప్రతిపనికీ వసూళ్లు ప్రారంభించారని ఆ నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు.
ఇటీవలే ఆ ఎమ్మెల్యే ఇంటి ఎదుటే వైసిపి కార్యకర్తలు ఆందోళనలకు దిగడం కూడా తెలిసిందే. ఒక ఉన్నతాధికారి అయిన ఆ ఎమ్మెల్యే 2014 లో అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి వైసీపీ పక్షాన పోటీచేసి ఏకంగా ఆంధ్రప్రదేశ్ లోని ఒక పుణ్యక్షేత్రం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు.మొన్నటి ఎన్నికల సమయానికి ఆయనకు టిక్కెట్టు డోలాయమానంలో ఉండగా అదృష్టం కలిసొచ్చింది.నెల్లూరు జిల్లాలోని ఒక వైసిపి ఎమ్మెల్యే టిడిపిలో వెళ్లిపోవడంతో అక్కడ అనివార్యమై ఈ ఎంపీగారిని వైసిపి నిలబెట్టింది.ఎన్నికల ప్రచార సమయంలోనే ఆయన గారు బాగా మందేసి రోడ్లపై చిందేస్తున్న వీడియోలు మీడియాలో వైరల్ అయి సంచలనం రేపాయి.అయితే జగన్ గాలి బలంగా వీయడంతో ఆయన కూడా అసెంబ్లీ మెట్లు ఎక్కేశాడు.అప్పటి నుండి ఆయన కలెక్షన్లకు తెర తీశారట.
చాలా డబ్బు ఖర్చు పెట్టుకుని గెలిచాను నా డబ్బు నాకు తిరిగి రావాలంటే ప్రతి పనికీ ఇంతని ఇవ్వాల్సిందేనంటూ నిర్మొహమాటంగా చెప్పడమే కాకుండా ఎంత పెద్దవారు సిఫార్సు చేసినా కూడా ఏమాత్రం కన్సెషన్ కూడా ఇవ్వకుండా పైసా వసూల్ సాగిస్తున్నారట.అంతేగాకుండా నెల్లూరు జిల్లాలో కీలకంగా వ్యవహరించే రెడ్డిసామాజికవర్గీయులను ఆయన బేఖాతర్ చేస్తున్నారట.ఎవడైతే నాకేంటి అన్న చందంగా ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే వైఖరి ఉండటం,బహిరంగంగానే డబ్బులు దండుకుంటుండటంతో విషయం పార్టీ హైకమాండ్ వరకూ వెళ్లిందని సమాచారం.
దీంతో వైసిపి పరిశీలకుడు,నెల్లూరు జిల్లాకే చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకటికి రెండుసార్లు ఈ విషయమై సదరు ఎమ్మెల్యేకు నచ్చజెప్పి వైఖరి మార్చుకోవాలని హితవు పలకగా ఆయన కి కూడా ఆ శాసనసభ్యుడి నుండి ధిక్కార వాణి వినిపించిందట.నేనింతే…నేను మారనంతే అన్నట్లు వ్యవహరిస్తున్న ఆ ఎమ్మెల్యే వల్ల పార్టీ పూర్తిగా డామేజ్ అవుతోందని వైసిపి క్యాడర్ ఆక్రోశిస్తోంది.ఒక్క జగన్ తప్ప ఎవ్వరూ అతన్ని అదుపు చేయలేరు అంటున్నారు.మరి పార్టీ అధినేత ఇంకా డ్యామేజ్ జరక్కుండానే ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.