మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్ళీ తాజా ఎస్ఈసీ కానున్నారు. మళ్ళీ ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు లైన్ క్లియర్ అయింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేసారు. నిమ్మదగ్గ రమేష్ కుమార్ ని ఎస్ఈసి గా కొనసాగించాలి అంటూ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చారు. అటు కోర్టులు స్పష్టంగా చెప్పడం, తాజాగా గవర్నర్ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వానికి ఇప్పుడు తప్పనిసరిగా మారింది. ఇక ఏ అడ్డూ లేకుండా నిమ్మగడ్డ మళ్ళీ తన పాత హోదాలోకి విచ్చేయనున్నారు.
అత్యంత నాటకీయ పరిణామాల మధ్య…!!
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి, సీఎం జగన్ కి మధ్య అగాధం మొదలయింది. దీంతో నిమ్మగడ్డని ఎలాగైనా తప్పించాలని చట్టాలు, ఆర్టికల్లు, క్లాజులు అన్నిటినీ ఆరాతీసిన జగన్ బృందం రాజ్యాంగంలోని 213 ఆర్టికల్ ప్రకారం నిమ్మగడ్డ పదవీ కాలాన్ని కుదించింది. ఆయన స్థానంలో చెన్నై కి చెందిన కానగరాజ్ ని నియమించారు. అప్పటికప్పుడు రెండు ఆర్డినెన్సులు తీసుకువచ్చి ఏప్రిల్ 12 న ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో నిమ్మగడ్డ స్వయంగా కోర్టులో పిటిషన్ వేశారు. విచారణకి స్వీకరించిన హైకోర్టు ఆయనకీ అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం సుప్రీం కి వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అక్కడా నిమ్మగడ్డకి అనుకూల తీర్పు రావడంతో మళ్ళీ ఆయన అదే స్థానంలో కొనసాగనున్నారు. ఇలా… ఆయనను తప్పించేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు, పన్నాగాలు చేసినా ఫలించలేదు. మరి ఇక్కడితో ఆగుతుందా, మరిన్ని అంశాలు తెరపైకి తీసుకువచ్చి, నిమ్మగడ్డని మళ్ళీ సాగనంపే ప్రయత్నాలు చేస్తారా అనేది ఇప్పటికీ సందేహమే..!