విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై మహారాష్ట్ర ప్రభుత్వం, జాతీయ దర్యవాప్తు సంస్థ నిర్లక్ష్యం వహిస్తున్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధంతోపాటు అమానవీయమని వారు మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. వరవరరావు ఆరోగ్యంపై సమాచారం ఇవ్వాలని ఆయన భార్య హేమలత, కుమార్తెలు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశారు. వరవరరావుకు కరోనా సోకిందనే విషయం తప్పితే ఆయన ఆరోగ్య పరిస్థితిని ఏమాత్రం తెలియజేయటం లేదని వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
వేరే మార్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం వరవరరావు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తెలుసుకున్నామని కూడా హైకోర్టుకు విన్నవించారు. జేజే ఆస్పత్రిలో తలకు గాయం కావడంతో నానావతి ఆస్పత్రికి తరలించారని వరవరరావు లాయర్ కోర్టుకు తెలిపారు. వరవరరావును సామాజిక దూరం ద్వారా అయినా కుటుంబ సభ్యులు చూసేలా ఆదేశాలించాలని కోరారు. ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కూడా కోరారు.
దీనిపై బాంబే హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. వరవరరావు వాస్తవ ఆరోగ్య పరిస్థితిపై బుధవారంలోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా వల్ల సామాజిక దూరం నుంచి వరవరరావును చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వగలరో లేదో కూడా చెప్పాలని సూచించింది. ఎల్గర్ పరిషత్ కేసులో 2018 జూన్ 6న అరెస్టైన వరవరరావు.. అప్పటి నుంచి మహారాష్ట్ర జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు.