(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత నితిన్ గడ్కరీ కూడా కరోనా బారిన పడ్డారు. తన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, హోం ఐసోలేషన్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. కరోనా సోకిన విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
“నిన్న నాకు అనారోగ్యంగా ఉంటే వైద్యుడిని సంప్రదించాను. అనంతరం కోవిడ్ -19 పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. వైద్యుల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇప్పుడు సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నాను. నాకు సన్నిహితంగా మెలిగిన వారు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి” అని తన నితిన్ గడ్కరీ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
ఇప్పటికే అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, శ్రీపాద నాయక్ సహా పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారిన పడి చికిత్స పొందిన విషయం తెలిసిందే.