Panjab: పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేసిన విషయం తెలిసిందే. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్ధూకు పాకిస్థాన్ తో సంబంధాలు ఉన్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన (సిద్ధూ) పంజాబ్ ముఖ్యమంత్రి అయితే దేశ భద్రతకే ముప్పు అని అమరీందర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. సిద్ధూకు పాక్ ప్రధాని తోనూ, పాక్ ఆర్మీ చీఫ్ తోనూ స్నేహం ఉందని ఆరోపించారు అమరీందర్ సింగ్.
సిద్ధూ అసమర్ధుడు అని వ్యాఖ్యానించిన అమరీందర్ తదుపరి పంజాబ్ సీఎంగా సిద్ధూ అనే ప్రతిపాదన వస్తే తాను కశ్చితంగా తిరస్కరిస్తానని స్పష్టం చేశారు. సిద్దూకు సీఎం పదవి ఇస్తే దేశానికే విపత్తుగా మారే ప్రమాదం ఉందని అమరీందర్ హెచ్చరించారు. పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న ఆధిపత్య పోరులో కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం పీఠాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. నలుగురు మంత్రులు, 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం అమరీందర్ అనర్హుడు అంటూ ఏకంగా సోనియా గాంధీకి లేఖ రాయడం, కొద్ది నెలల్లో పంజాబ్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో సీఎం పదవి నుండి అమరీందర్ తప్పుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.