బీజేపీకి తాము తప్ప ఎవరూ లేరని అనుకున్నారు. తాము మాట్లాడితే తప్ప.. బీజేపీ వ్యూహాలు ప్రజల్లోకి చేరబోవని కూడా భావించారు. అందుకే.. ఎక్కడ గళం విప్పినా.. తాము పార్టీని డెవలప్ చేస్తున్నామని పదే పదే చెప్పుకొచ్చారు. తాము పార్టీని అన్ని కోణాల్లోనూ బలోపేతం చేస్తున్నామని అన్నారు. కానీ, ఇప్పుడు వారి పరిస్థితి దారుణంగా మారింది. కనీసం పార్టీ అధిష్టానం కానీ, కీలక నాయకులు కానీ.. వారికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కనీసం వారిని పట్టించుకోలేదు.
వారే.. బీజేపీ కీలక నాయకులు… సోము వీర్రాజు, విష్ణువర్ధన్, జీవీఎల్ నరసింహారావు. ఈ ముగ్గురిదీ ఒకే మాట. బీజేపీనే అన్నీ .. ఏపీని శాసించిందీ బీజేపీనే అని! కానీ, ఇప్పుడు అదే బీజేపీకి వీరికి కేరాఫ్ లేకుం డా చేసింది. తాజాగా ప్రకటించిన ఆరు పార్లమెంటు స్థానాల్లో జీవీఎల్ నరసింహారావు పేరు ఎక్కడా లేదు. ఆయన వాస్తవానికి విశాఖపట్నం పార్లమెంటు సీటుపై అనేకఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా తనకే వస్తుందని భావించారు. అందుకే షెడ్యూల్ కన్నా ముందే అక్కడ పాగా వేశారు.
నిత్యంప్రజలతో మమేకమయ్యారు. అనేక కార్యక్రమాలు కూడా జీవీఎల్ సారథ్యంలో ముందుకు సాగాయి. కానీ, పార్టీ అసలు పొత్తులో భాగంగా ఈ సీటును అడగలేదు. దీంతో జీవీఎల్ పరిస్థితి దారుణంగా మారింది. ఇక, సోము వీర్రాజు.. ఆది నుంచి రాజమండ్రిపై కన్నేశారు. తన పుట్టిన ఊరు కావడం.. తనకు తెలిసిన వర్గాలు అందుబాటులో ఉండడంతో ఆయన నమ్మకంగా ఉన్నారు. అంతేకాదు.. కాపు సామాజిక వర్గం మొత్తంగా తన వెంటే ఉంటుందని లెక్కలు వేసుకున్నారు.
అయితే.. సోము పేరు కూడా ఎక్కడా బయటకు రాలేదు. ఇక, విష్ణు వర్ధన్రెడ్డి కడపపై అనేక ఆశలు పెట్టు కున్నారు. నిత్యం ఆయన కడపను టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసుకు ని విమర్శలు కూడా సంధించారు. అయినప్పటికీ. ఆయనకు కూడా టికెట్ రాలేదు. మొత్తంగా చూస్తే.. ఈ ముగ్గురు నాయకులు.. పేపర్ పులులుగానే మారారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి. కనీసం అసెంబ్లీసీట్లయినా దక్కుతాయా? లేక అక్కడ కూడా మొండి చేయేనా అనేది ఆసక్తిగా మారింది.