Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జరగబోయే ఎన్నికలను సవాల్ గా తీసుకున్నారు. ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలోకి తన బృందంగా అడుగు పెట్టాలని, అధికారంలో భాగస్వామ్యం కావాలని కృతనిశ్చయంతో ఉన్నారు. టీడీపీతో ఇప్పటికే పొత్తు ఫిక్స్ కాగా, బీజేపీని కూడా ఈ కూటమిలో కలవాలని ఆశిస్తున్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ క్రమంలో పవన్ జిల్లాల పర్యటనలపై ప్రణాళికను రూపొందించారు. ఇందు కోసం ప్రత్యేక హెలికాఫ్టర్ సిద్దం చేసుకున్నారు. 175 నియోజకవర్గాల్లో హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు అనువైన ప్రదేశాలను గుర్తించారు. ప్రతి జిల్లాలో పవన్ కళ్యాణ్ మూడు సార్లు పర్యటించాలని నిర్ణయించారు. తొలి విడత పర్యటనలో జిల్లాల ముఖ్యనేతలతో సమావేశాలు ఉంటాయని చెబుతున్నారు.
రేపటి (14వ తేదీ) నుండి గోదావరి జిల్లాల్లో పర్యటనలకు ప్లాన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. నాలుగు రోజుల పాటు గోదావరి జిల్లాల్లో ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహించాలని భావించారు. 14వ తేదీ భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమీక్ష, 15న అమలాపురంలో తూర్పు గోదావరి జిల్లా నేతలతో, 16న కాకినాడలో మరో సారి సమీక్ష, 17న రాజమండ్రిలో పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించేందుకు రూట్ మ్యాప్ ఖరారు అయ్యింది.
అయితే పవన్ కు జగన్ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు భీమవరం ఆర్ అండ్ బీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో బుధవారం భీమవరం కార్యక్రమాన్ని పవన్ వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
భీమవరంలోని విష్ణు కాలేజీ మైదానంలోని హెలిప్యాడ్ లో పవన్ ప్రయాణించే హెలికాఫ్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతి కోరితే ఆర్ అండ్ బీ అధికారులు అభ్యంతరం చెబుతూ నిరాకరించారని ఆయన తెలిపారు. దీని వెనుక అధికార పార్టీ ఒత్తిడి ఉన్నట్లు అర్ధం అవుతోందన్నారు. ఇదే హెలిప్యాడ్ ను పలువురు ప్రముఖులు భీమవరం పర్యటనకు వచ్చినప్పుడు వినియోగించారని చెప్పారు.
ఇప్పుడు పవన్ విషయంలో అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉందన్నారు. ఇదే తరహాలో అమలాపురంలోనూ ఆర్ అండ్ బీ అధికారులు అనుమతుల విషయంలో అడ్డంకులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపునకు వాడుకోవడాన్ని ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
KCR: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్ర పోనివ్వకుండా వెంటపడతాం – కేసీఆర్