YV Subba Reddy: వైసీపీ కీలక నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏపీ రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఏపీకి రాజధాని లేదని మరో సారి స్పష్టం అవుతోంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ రికార్డులో నిలిచిపోతుంది. అమరావతిని ఏపీ రాజధానిగా గతంలోనే కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినప్పటికీ ఏపీలోని జగన్ సర్కార్ మూడు రాజధానులు చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే రాజధాని వివాదం సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది.
ప్రస్తుతానికి అమరావతియే ఏపీకి రాజధాని అని, కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఇటీవల పేర్కొన్నారు. అయితే మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి రాజధాని అంశంపై సంచలన కామెంట్స్ చేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరి కొంత కాలం కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే జూన్ లో ఉమ్మడి రాజధాని గడువు పూర్తి కానుందని ఆయన పేర్కొన్నారు.
2014 విభజన తర్వాత సుమారు పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను పెట్టారని గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం కూడా తాత్కాలిక రాజధానిగా అమరావతిని నిర్మించడం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ రాజధాని అని అనుకున్నామన్నారు. దానిపై కూడా న్యాయపరమైన ఇబ్బందులు పెట్టారని, వాటిని కూడా ఎదుర్కొంటున్నామని తెలిపారు. వాటిని అన్నింటినీ అధిగమించేంత వరకూ హైదరాబాద్ ను కొనసాగించాలని తమ ఆలోచన అని వివరించారు.
ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి తో కలిసి హైదరాబాద్ రాజధానిగా ఉండటంపై వివరణ ఇస్తారని చెప్పారు. విశాఖ రాజధాని గా వచ్చేంత వరకూ కూడా హైదరాబాద్ కొనసాగితే బాగుంటుందని తమ ఆలోచన అని చెప్పారు. ఉమ్మడి రాజధాని అంశంపై వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. సుబ్బారెడ్డి వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Pawan Kalyan: పవన్ కు జగన్ సర్కార్ షాక్ .. భీమవరం పర్యటన వాయిదా