బీజేపీ నుండి సస్పెన్షన్ కు గురైన గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బిగ్ షాక్ తలిగింది. పీడీ యాక్ట్ ఎత్తివేయాలని కోరుతూ రాజాసింగ్ చేసుకున్న విజ్ఞప్తి తిరస్కరణ గురైంది. ఈ మేరకు ఆయన పై నమోదైన పీడీ యాక్ట్ కు సంబంధించి బుధవారం అడ్వైజరీ బోర్డు తీర్పు వెలువరించింది. రాజాసింగ్ పై నమోదు చేసిన పీడీ యాక్ట్ ను అడ్వైజరీ బోర్డు సమర్దించింది. ఈ మేరకు ప్రభుత్వానికి బోర్డు నివేదిక పంపింది. ఈ ఏడాది ఆగస్టు 22వ తేదీన సోషల్ మీడియాలో రాజాసింగ్ ఓ వీడియోను అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలో మహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపించింది. రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనలు నిర్వహించారు. దీంతో ఆయనను పోలీసులు ఆగస్టు 23న అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హజరుపర్చగా 41 ఏ నోటీసు ఇవ్వలేదన్న కారణంగా రిమాండ్ రిపోర్టును తిరస్కరించి బెయిల్ మంజూరు చేయడంతో విడుదల అయ్యారు. అయితే రాజాసింగ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగడం, పలు పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదులు నమోదు కావడంతో అగస్టు 25న రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అప్పటి నుండి ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు.
తనపై నమోదు చేసిన పీడీ యాక్ట్ ను ఎత్తివేయాలని అడ్వైైజరీ బోర్డు ను రాజాసింగ్ కోరారు. ఆయన సతీమణి ఉషాబాయి కూడా తన భర్తపై పీడీ యాక్ట్ ఎత్తివేయాలని బోర్డుకు వినతి పత్రం సమర్పించింది. పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ భాస్కరరావు, మరో ఇద్దరు న్యాయమూర్తుల సమక్షంలో విచారణ సాగింది. గత నెల 29న పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చర్లపల్లి జైలు లో ఉన్న రాజా సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కు హజరైయ్యారు. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేయడానికి దారి తీసిన పరిస్థితులను అడ్వైజరీ బోర్డుకు పోలీసులు వివరించారు. ఆయనపై వందకుపైగా కేసులు నమోదైన విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకువచ్చారు పోలీసులు. ఇరుపక్షాల వాదనలు విన్న అడ్వైజరీ బోర్డు .. పీడీ యాక్ట్ ను సమర్ధించింది రాజా సింగ్ విజ్ఞప్తిని తోసి పుచ్చింది.
మరో పక్క రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య హైకోర్టు లో దాఖలు చేసిన పిటిషన్ విచారణ జరుపుతోంది. ఈ కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఇటీవల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణ ఈ నెల 28వ తేదీ హైకోర్టులో జరగనున్నది. దీంతో ఆ విచారణ రోజే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు తీర్పును ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉంది.