జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాలలో ముఖ్య భూమిక పోషించడం మానేశారు. అయితే ఈ మధ్య కాలంలో అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేవనెత్తిన ఒకే ఒక్క అంశం పదవ తరగతి పరీక్షల రద్దు. ప్రధాన ప్రతిపక్షం వారు పెద్దగా ఆసక్తి చూపని ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థుల ప్రాణాలను ఇబ్బంది పెట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వంపై పదేపదే ఒత్తిడి పెంచడం మొదలుపెట్టాడు.
ఇకపోతే బిజెపి తో కలిసి తనకు వచ్చిన ప్రతి అవకాశంలో వైసిపి ఇరుకున పెట్టే విధంగా పవన్ వ్యవహరిస్తుండగా జగన్ కూడా జనసేన విషయంలో అదే రకంగా ఉన్నారు. ఆ పార్టీ చేసే విమర్శలు పెద్దగా పట్టించుకోని ఆయన అవకాశం వస్తే మాత్రం వారికి అలా చురకలు అంటిస్తుంటారు. అయితే తాజాగా పవన్ విపరీతంగా వైసిపి పైన ఫైర్ అయిపోయి ఎట్టిపరిస్థితుల్లో పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలి అన్న రెండు రోజులకే ప్రభుత్వం పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి కలిగించింది.
ఈ విషయంలో ముందుగా ప్రభుత్వం పెద్దగా స్పందించకపోయినా…. స్వయంగా పవన్ కళ్యాణ్ సీఎం జగన్ కు ఫోన్ చేసి పరీక్షలు రద్దు చేయాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి జగన్ కూడా స్పందించి అత్యవసరంగా అధికారులకు ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు కూడా జనసైనికులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం నుండి నిర్ణయం వెలువడిన వెంటనే పవన్ జగన్ కు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పినట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాల మాట అటుంచితే వారిరువురు ఇలా ఫోన్లో మాట్లాడుకోవడం అన్న ఆలోచనే అందరిని అవాక్కు చేస్తోంది.