మీరు విన్నది నిజమే. పోలీసులు తన బండిని ఆపారని ఓ వ్యక్తి ఏకంగా తన బండిని కాల్చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్లో వున్న ట్రాఫిక్ సమస్యలు గురించి అందరికీ తెలిసినదే. ఈ ట్రాఫిక్ పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఈమధ్యకాలంలో అక్కడ నిబంధనలు కచ్చితంగా పాటించాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే నేటి నుండి రూల్స్ మీరితే ఫైన్ తప్పదని కూడా హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఉదయం నుంచే కూడళ్లలో ఉండి రూల్స్ పాటించని వాహనదారులకు ఫైన్లు విధిస్తున్నారు.
ఇకపోతే విధుల్లో భాగంగా అమీర్పేట మైత్రివనం కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ రాంగ్ రూట్లో వచ్చిన ఎల్లారెడ్డిగూడకు చెందిన అశోక్ను ఆపి.. బండి తాళం తీసుకున్నారు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన అశోక్ తనను ఎందుకు ఆపారని వాగ్వాదానికి దిగాడు. తరువాత మైత్రీవనంలో తాను నిర్వహించే మొబైల్ షాప్ వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి పెట్రోల్తో వచ్చి.. తన బండిపై పోసి నిప్పంటించాడు.
కట్ చేస్తే, బైక్ మంటల్లో కాలి బూడిద అయిపోయింది. ఈ ఘటనపై అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే పోలీసులు ఫైర్ స్టేషన్కు కాల్ చేశారు. వారు వచ్చి మంటలు ఆర్పారు. కాగా ఈ వ్యవహారాన్ని పోలీసులు కొంచెం సీరియస్గానే తీసుకున్నారు. రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేయడం, తమ విధులను అడ్డుకోవటం కింద అశోక్పై కేసు నమోదు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా ఇది చూసిన జనాలు గోటితో పోయేదానికి గొడ్డలిదాగా ఎందుకు? అని నిస్తేజులైనారు.