రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఒకప్పుడు బిజీ స్టార్ హీరోయిన్. ఏ సినిమా మొదలైనా అందులో రకుల్ ప్రీత్ మాత్రమే కావాలి అన్నంతగా క్రేజ్ ని సంపాదించుకుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు సెట్స్ మీదకి వస్తున్నాయంటే హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని ఫిక్స్ అవ్వాల్సిందే. టాలీవుడ్ లోకి కెరటం లా వచ్చి పడింది. కేవలం రెండు సినిమాలతోనే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి డేట్స్ సర్దలేనంత బిజీ హీరోయిన్ గా గడిపింది. కాని పూజా హెగ్డే లాంటి వాళ్ళు రావడం అదే సమయంలో రకుల్ చేసిన సినిమాలు ఫ్లాపవడం తో రకుల్ దూకుడు కి బ్రేక్ పడింది.
ఇక సీనియర్ హీరో నాగార్జున తో మన్మధుడు 2 లో చేయడం కూడా రకుల్ ప్రీత్ సింగ్ కి పెద్ద మైనస్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూట గట్టుకోవడం తో ఇక రకుల్ సినిమా కెరీర్ క్లోజ్ అనుకున్నారు. కాని వరసగా అవకాశాలు అందుకొని షాకిస్తోంది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్, టబు లతో కలిసి దే దే ప్యార్ దే సినిమా చేసి సూపర్ హిట్ అందుకొని అక్కడ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాదు ఇక తెలుగులో అవకాశాలు రావు అనుకున్న రకుల్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తోంది.
ఇప్పటికే క్రిష్ – వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాని కంప్లీట్ చేసింది. కొండపొలం అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే నితిన్ – చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చెక్ అన్న సినిమాలో లాయర్ గాకనిపించబోతోంది. ఈ సినిమా కూడా దాదాపు టాకీపార్ట్ కంప్లీట్ కావస్తుందని సమాచారం. బాలీవుడ్ లో మరోసారి అజయ్ దేవగన్ నటిస్తున్న మేడే అన్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ఎటాక్ సర్దార్ అండ్ గ్రాండ్ సన్, తమిళంలో అయలన్ చేస్తోంది.
ఇక కమల్ హాసన్ ఇండియన్ 2 గనక మొదలైతే ఆ సినిమాలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ ఒక హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా కెరీర్ క్లోజ్ అన్న సమయంలో ఇన్ని సినిమాలు చేస్తూ రకుల్ ప్రీత్ సింగ్ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ప్రస్తుతం కరోనా బారిన పడి రెస్ట్ తీసుకుంటోంది. త్వరలో కోలుకొని సెట్స్ లోకి అడుగుపెడతానని చెప్పుకొచ్చింది.