(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యను ప్రభుత్వంతో సహా అందరూ ఖండిస్తుండగా మరో పక్క ఈ దారుణం రెవెన్యూ శాఖ నుండి ప్రజలు ఎదుర్కొంటున్న బెడదపై చర్చకు దారి తీస్తున్నది. విజయారెడ్డి హత్యను నిరసిస్తూ రెవెన్యూ వర్గాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యాదాద్రి జిల్లా గుండాల తహశీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో లంచాల కోసం రెవెన్యూ ఉద్యోగులు వేధిస్తున్నారంటూ ఒక మహిళా రైతు విఆర్ఒపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లంచం తీసుకుని కూడా పాస్ పుస్తకం ఇవ్వలేదని మహిళా రైతు ఆరోపించింది. రెవెన్యూ ఉద్యోగులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా వారు నిరసన ముగించి కార్యాలయంలోకి వెళ్లిపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.