హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణహత్య ఉదంతం వెనుక కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. విజయారెడ్డి హత్యపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య వెనుక కుట్ర ఉందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ‘భూవివాదమే’ అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ దాడికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. 120 ఎకరాల భూములపై 1990 నుంచి వివాదం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వివాదంలో కొంత మంది రాజకీయనేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే నిందితుడు సురేష్ తమ భూమి పట్టా కోసం చాలా కాలంగా ఎమ్మార్వోను కలుస్తున్నట్టు విచారణలో వెల్లడించాడు.
పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం తహశీల్దార్పై వత్తిడి తెచ్చాడని.. అయితే విజయారెడ్డి తనకు అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ భూములపై కొందరు రాజకీయ నేతల కళ్లు పడ్డాయని సమాచారం. ఈ వివాదస్పదమైన భూముల వ్యవహారంలో కొందరు పెద్దలు తమకు అనుకూలంగా రికార్డులు మార్చాలని అధికారులపై ఒత్తిళ్లు చేసినట్లు తెలుస్తోంది. 120 ఎకరాల వివాదంపై హైకోర్టులో కేసులున్నాయి. వివాదాస్పద భూముల వ్యవహారంలో మంత్రి పేరు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకు చెందిన రాజకీయ నేతలు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ నేతలు ఎవరు ? అనేదానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
మరోవైపు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ప్రోద్బలం వల్లే విజయారెడ్డిపై దాడి జరిగిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రెవెన్యూ అధికారులను దొంగలుగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మేజిస్ట్రేట్ అధికారాలున్న అధికారిణిపై దాడి చేయడం దారుణమన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే రోజులు వచ్చాయని విమర్శించారు. విజయారెడ్డి హత్య ఘటనపై సీబీఐ విచారణ జరపాలని, ఈ ఘటనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం మహిళా తహశీల్దార్ విజయారెడ్డిపై సురేష్ కిరోసిన్ పోసి తగలబెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. మంటలు అంటుకున్న విజయారెడ్డిని రక్షించేందుకు ప్రయత్నించిన డ్రైవర్, అటెండర్ తీవ్ర గాయాలపాలయ్యారు. నిందితుడు సురేష్ కూడా మంటలు అంటుకుని గాయపడ్డాడు. డ్రైవర్ గురునాథం అపోలో డీఆర్డీవో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. నిందితుడు సురేష్ పక్కా పథకం ప్రకారమే విజయారెడ్డిని హతమార్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ముందు సురేష్తో పాటు మరో ఇద్దరు రెక్కీ నిర్వహించారని, మధ్యాహ్న భోజన విరామ సమయంలో కార్యాలయానికి వచ్చే సందర్శకులు తక్కువగా ఉంటారని భావించే… ఆ సమయంలో దారుణానికి ఒడిగట్టినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో సురేష్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.