అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) గా అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్ ను నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కానుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జేఎస్వీ ప్రసాద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేఎస్వీ ప్రసాద్ స్థానంలో ఇప్పటికే సతీష్ చంద్రను నియమించారు. గతంలో జేఎస్వీ ప్రసాద్ టీటీడీ బోర్డ్ ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా సేవలందించారు. ప్రస్తతుం టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయనకు వేరేచోటకు బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, అనిల్ కుమార్ కు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్న విషయమై స్పష్టత రావాల్సివుంది.
టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ని గత టీడీపీ ప్రభుత్వం నియామించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో అధికార యంత్రాంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే పలువురు ఐఏఎస్లను బదిలీ చేశారు. సీఎం పేషీలో కొత్తవారి నియమించిన జగన్, బాబు హయాంలో ఉన్నవారిని తప్పించారు. సీఎస్ గా కోరి తెచ్చుకున్న ఎల్వీ సుబమణ్యంను సైతం బదిలీ చేసింది. ఇప్పుడు తాజా టీటీడీ ఈఓను సైతం బదిలీకి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.