గుమ్మడి సంధ్యారాణి. టీడీపీ సీనియర్ నాయకురాలు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా. ఒకవైపు నాయకులు టికెట్ కోసం కొట్టుకుంటున్నా.. ఆమెను చంద్రబాబు ఏరికోరి మరీ ఎంపిక చేశారు. ఎస్టీ కోటాలో విజయ నగరం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి సంధ్యారాణికి టికెట్ ఇస్తున్నట్టు తొలి జాబితాలోనే ప్రక టించిన బాబు.. చేతులు దులుపుకొన్నారు. ఒక నియోజకవర్గం సమస్య తీరిందని ఆయన భావించి ఉంటారు. క్షేత్రస్తాయిలో వారే చూసుకుంటారని కూడా అనుకుని ఉండొచ్చు.
అయితే.. అసలు కష్టాలు సంధ్యారాణికి ఇప్పుడే మొదలయ్యాయి. సొంత పార్టీ నాయకులు ఆమెకు వ్యతి రేకంగా గళం వినిపిస్తున్నారు. అంతేకాదు.. ఆమె వ్యక్తిగత విషయాలను తెలిసి ఉన్న కొందరు నేతలు. ప్రత్యర్థులకు ఉప్పందించి మరీ.. ఆమెను ఇరుకున పెడుతున్నారు. దీంతో సంధ్యారాణి పొలిటికల్ సంధి కాలంలో చిక్కుకు పోయారు. సాలూరు ఎస్టీ నియోజకవర్గం. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గాలకే టికెట్ కేటాయించాలి. చంద్రబాబు కూడా ఇదే చేశారు.
కానీ, ఆమె అంటే పడని కొందరు సొంత నేతలు ఇప్పుడు చిచ్చురేపారు. ఆమె ఎస్టీ కాదంటూ.. ఆదివాసీ వికాస్ పరిషత్కు ఆధారాలతో సహా సమాచారం చేరవేశారు. అంతేకాదు.. ఆమె ఆచార వ్యవహారాలు తెలిసిన నాయకులు కూడా దీనికి దోహదపడ్డారు. సంధ్యారాణి చెప్పుకొంటున్నట్టుగా.. ఆమె కొండదొర సామాజిక వర్గం కాదనేది ప్రధాన ఆరోపణ. ఆమె ఉత్తరాంధ్రలో ఓసీలుగా చలామణి అవుతున్న వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు అనేది వీరు చేస్తున్న వాదన.
దీంతో రంగంలోకి దిగిన ఆదవాసీ పరిషత్.. సంధ్యారాణి సామాజిక వర్గం పై న్యాయ పోరాటానికి దిగింది. ఆమె కులం ఏంటో తేల్చాలంటూ.. కలెక్టర్కు ఫిర్యాదులపై ఫిర్యాదులు చేసింది. అంతేకాదు.. ఆమెకు టికెట్ ఇస్తే.. దీనిపై కోర్టులోనూ కేసులు వేస్తామని తేల్చిచెప్పింది. అయితే.. గతంలోనూ ఆమెకు టికెట్ ఇచ్చారు. అప్పుడు రాని సందేహాలు, అనుమానాలు ఇప్పుడు రావడం వెనుక వ్యూహాత్మకంగాపార్టీలో ఆమెను వ్యతిరేకిస్తున్నవారే చేస్తున్నారనేది ప్రధాన సమస్య. మరి దీనిని ఆమె ఎలా ఎదుర్కొంటారో చూడాలి.