ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ను రష్యా దేశం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాక్సిన్కు రష్యా స్పుత్నిక్-V గా నామకరణం చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాక్సిన్ తొలి డోసును తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి ఇప్పించారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు రష్యా వ్యాక్సిన్పై అనేక సందేహాలు నెలకొన్నాయి. అనేక దేశాల్లో ఉన్న సైంటిస్టులు, వైద్య నిపుణులు ఆ వ్యాక్సిన్పై అనుమానాలను లేవనెత్తుతున్నారు.
నిజానికి రష్యా ఆ వ్యాక్సిన్ను విడుదల చేసినప్పుడు దాన్ని 38 మందిపై ప్రయోగించామని, వారందరూ కోలుకున్నారని.. అందువల్ల వ్యాక్సిన్ సురక్షితమేనని తెలిపింది. అంతేకానీ.. దానికి సంబంధించిన పరిశోధన పత్రాలు, ఇతర రుజువులను వేటినీ బయటకు విడుదల చేయలేదు. దీంతో అందరిలోనూ అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ఆ వ్యాక్సిన్ తో రష్యా నిజంగానే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిందా ? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ట్రయల్స్ చేపట్టారు ? ఫేజ్ 1, 2, 3 ట్రయల్స్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయి ? వాటి తాలూకు పత్రాలు ఏవి ? జంతువులపై ఆ వ్యాక్సిన్ను ప్రయోగించి ఉంటే.. ఆ వివరాలు ఏవి ? వంటి ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి.
అయినప్పటికీ రష్యా ఆయా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు. నేరుగా వ్యాక్సిన్ను విడుదల చేసింది. అక్టోబర్లో అక్కడ వ్యాక్సిన్ను ప్రజా పంపిణీకి సిద్ధం చేయనున్నారు. అయితే రష్యా ఈ విధంగా వ్యవహరిస్తుండడంపై అనేక దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రష్యా కరోనా వ్యాక్సిన్ను వాడవచ్చా, వద్దా.. అనే విషయాన్ని ఆయా దేశాలు పరిశీలిస్తున్నాయి. భారత్తో సహా 20 దేశాలు రష్యా వ్యాక్సిన్ కోసం ప్రీ ఆర్డర్లను ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆయా దేశాలు వ్యాక్సిన్ను వాడాలా, వద్దా.. అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సమీక్షించనుంది. ఆ సంస్థ బృందం రష్యాలో ఆ వ్యాక్సిన్ ట్రయల్స్ తాలూకు వివరాలను పరిశీలించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.