ఆయనో మంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్కు సన్నిహితుడనే పేరున్న మంత్రి . కానీ ఆయనకు ఓ సీనియర్ నేతకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇందులోకి మధ్యలో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది.
ఆయనే తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్. హైదరాబాద్ లోని గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ పై జరిగిన దాడి కలకలం సృష్టించింది. అయితే, దీనిపై తదనంతర పరిణామాలు సైతం అదే రీతిలో వార్తల్లో నిలుస్తోంది.
నారాయణ మాటల మంటలు
తనను హత్య చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని, తనను చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ తన సెక్యూరిటీ తనను రక్షించిందని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. `నన్ను బర్తరఫ్ చేయాలని సీపీఐ నేత చికెన్ నారాయణ అనడం ఆశ్చర్యమేసింది. ఆయన బీజేపీలో ఎప్పుడు చేరారు?` అని మంత్రి అజయ్ ప్రశ్నించారు. అయితే , మంత్రి పువ్వాడ అజయ్ చేసిన కామెంట్లపై నారాయణ సైతం అదే రీతిలో సీరియస్ అయ్యారు. మంత్రి మీద హత్యాయత్నం చేశారా అనే మీడియా ప్రశ్నకు…పిల్లిని చంపినా ఒకటే..పువ్వాడ అజయ్ ని చంపినా ఒకటే అంటూ కామెంట్ చేశారు.
ఆ మంత్రిని చంపే ప్రయత్నం జరిగిందా?
అయితే, నారాయణ మాటలపై మంత్రి పువ్వాడ అజయ్ మళ్లీ స్పందించారు. బాచుపల్లిలో తన మెడికల్ కళాశాలకు వెళుతుండగా ఫోరం మాల్ దగ్గర బిజెపి కార్యకర్తలు తన కాన్వాయ్ పై దాడి చేశారని తెలిపారు. బీజేపీ ప్రస్టేషన్ తో తనపై దాడికి దిగిందని.. కమలం పువ్వు నేతలకు చెబుతున్నా కారులో డబ్బులు పెట్టి పంచడానికి తాను వెర్రపువ్వుని కాదని ఫైర్ అయ్యారు. తనపై దాడి చేసిన సమయంలో బిజెపి కార్యకర్తలు దాడికి దిగి కారుపై ఎక్కిన కారు తనది కాదని….తన కాన్వాయ్ లోని వాహనాలన్నీ ఫార్చునర్ లేనని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు తనను చంపడానికి ప్రయత్నించారని… బీజేపీ తనపై చేసిన దాడిని ఈ చికెన్ నారాయణ సమర్ధిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. తానూ కమ్యూనిస్టు బిడ్డనే. ఇటువంటి దాడులకు బెదిరింపులకు భయ పడేది లేదని స్పష్టం చేశారు. నారాయణ లాంటి సీనియర్ నేత పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడటం సరికాదని చురకలు అంటించారు.