ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి షాకివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటే మరోవైపు సొంత పార్టీ నేతలే నడిజబారుపై పరువు తీస్తున్నారు. రాజకీయ ఎత్తుగడలు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు అనుకోకుండా పరువు తీసే పనులు ఇంకోవైపు జరుగుతున్నాయి. ఇదంతా ఒకేరోజు జరిగిన ఘటనలు.
కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకోవాలంటూ తమ ఉద్యమాన్ని రైతులు ఉధృతం చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశరాజధానికే పరిమితమైన ఈ ఆందోళనకు క్రమంగా మద్దతు పెరిగి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతుండగా.. మంగళవారం భారత్ బంద్ జరిగింది. ఈ బంద్ సమయంలోనే టీఆర్ఎస్ నేతల తీరు చర్చగా మారింది.
ఓ ఎమ్మెల్యే , ఇంకో ఎమ్మెల్సీ రచ్చ
భారత్ బంద్కు టీఆర్ఎస్ పార్టీ మద్దతు , ఆందోళనల్లో పాల్గొనే సమయంలో పలు చిత్రాలు జరిగాయి. బంద్ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఆమన్ గల్ లో.. టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. MLA జైపాల్ యాదవ్, MLCకసిరెడ్డి నారాయణరెడ్డి వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ముందు MLCకసిరెడ్డి నారాయణరెడ్డి రాస్తారోకో చేశారు. తర్వాత ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అక్కడికి వచ్చారు. ఎమ్మెల్యే వర్గీయులు,, MLCవర్గంపై దాడికి ప్రయత్నించారు. రెండువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇదంతా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముందే జరిగింది. ఆఖరికి ఎప్పట్లాగే… పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
ఎమ్మెల్యే వల్ల ఉద్రిక్తత
మరోవైపు శేరిలింగంపల్లి భారత్ బంద్ లో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోడ్డుపై ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని సామాన్య వ్యక్తి ఒకరు ప్రశ్నించారు. ధర్నా కోసం టైం పెట్టారు కదా.. ముందే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. దీంతో ప్రశ్నించిన వ్యక్తిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేయిచేసుకున్నారు. ఎమ్మెల్యే వెంట ఉన్న కార్యకర్తలు.. ప్రశ్నించిన వ్యక్తిని అక్కడి నుంచి తోసివేశారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై జనం మండిపడ్డారు. అసలైన రైతులు శాంతియుతంగా బంద్ లో పాల్గొంటుండగా.. పార్టీల నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని ఈ ఘటనపై సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అయ్యాయి.