Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గోటబయా రాజపక్స దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. గత కొంత కాలంగా శ్రీలంకలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని ఆంటాయి. అయినప్పటికీ నిత్యావసర వస్తువులు దొరకని పరిస్థితి నెలకొంది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ లభించడం లేదు. విద్యుత్ సంక్షోభంతో వీధి దీపాలు కూడా వెలగని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం వేలాది మంది అధ్యక్షుడి నివాసంపై దండెత్తారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు రాజపక్స శుక్రవారం దేశ వ్యాప్త ఎమర్జెన్సీ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సైన్యానికి విశేష ఆధికారులు కట్టబెట్టినట్లు అయ్యింది. ఈ ఎమర్జెన్సీ ఉత్తర్వులతో విచారణ లేకుండానే ఆందోళనకారులను అరెస్టు చేసి దీర్ఘకాలం నిర్బంధించడానికి అవకాశం ఏర్పడుతోంది.
శ్రీలంక 1948 నుండి స్వాతంత్ర దేశంగా అవతరించింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఏడు దశాబ్దాలలో ఇటువంటి ఆర్ధిక సంక్షోభాన్ని దేశం ఎదుర్కోలేదు. నిత్యావసరాల కొరత, ధరల పెరుగుదల, రోజుకు 14 గంటల విద్యుత్ కోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు అడుగంటి పోయాయి. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. రోజురోజుకు ప్రజాగ్రహం వెల్లువెత్తుతుండటంతో ఈ ఆందోళనలను అణచివేయడానికి ఎమర్జెన్సీని విధిస్తూ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు.