Supreme Court: తమిళనాడు గవర్నర్ రవి తీరును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు గవర్నర్ నిరాకరించడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పొన్ముడికి హైకోర్టు విధించిన శిక్షను ఇటీవల సుప్రీం కోర్టు సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆయనను మంత్రి వర్గంలో తీసుకోవాలని సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు.
అయితే పొన్ముడి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి తమిళనాడు గవర్నర్ రవి నిరాకరించారు. పొన్ముడి శిక్షపై సుప్రీం కోర్టు స్టే మాత్రమే విధించిందనీ, పూర్తిగా కేసు కొట్టేయలేదని చెబుతూ గవర్నర్ రవి ..స్టాలిన్ సర్కార్ నిర్ణయాన్ని తిరస్కరించారు.
గవర్నర్ నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, సుప్రీం కోర్టు ఇవేళ విచారణ జరిపింది. గవర్నర్ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ధర్మాసనం మండిపడింది. ఈ నెల 22వ తేదీలో పొన్ముడి చేత ప్రమాణ స్వీకారం చేయాలని తమిళనాడు గవర్నర్ కు సుప్రీం కోర్టు గడువు విధించింది.
కాగా, పొన్ముడి 2006 నుండి 2011 వరకూ విద్య, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 లో పొన్ముడి, ఆయన భార్య పై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కేసు నమోదైంది. ఈ కేసులో పొన్ముడిని దోషిగా నిర్ధారించిన ట్రయల్ కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై పొన్ముడి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ చుక్కెదురైంది.
అయితే సుప్రీం కోర్టులో ఆయనకు ఊరట లభించింది. దిగువ కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దీంతో పొన్ముడి శాసనసభ సభ్యత్వాన్ని పునరుద్దరించినట్లు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ తెలిపారు. దీంతో పొన్ముడిని తిరిగి మంత్రిగా నియమించాలని గవర్నర్ ను కోరారు. కానీ గవర్నర్ దాన్ని నిరాకరించడంతో వివాదం చెలరేగింది.
AP High Court: ఏపీపీఎస్సీ గ్రూప్ -1 పరీక్ష రద్దుపై హైకోర్టు కీలక ఆదేశాలు