AP High Court: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవేళ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీపీఎస్సీ 2018 గ్రూప్ 1 అంశంలో మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్ధుల జాబితాను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు పాక్షిక స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఉద్యోగంలో ఉన్న వారికి యథాతథ స్థితిని కల్పించింది.
గ్రూప్ -1 మెయిన్స్ ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. మెయన్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అందులో పేర్కొన్నారు. దీనిపై ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేశాయి. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం .. తాజాగా పాక్షిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
2018 గ్రూప్ ఒన్ కింద 167 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఎంపికలో అవకతవకలు జరిగాయని, మూడు సార్లు మూల్యాంకన జరిగిందని కొందరు అభ్యర్ధులు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. మరో వైపు ..హైకోర్టు ఆదేశాలతో డిజిటల్ మూల్యాంకన రద్దు చేసి ఒక సారి మాత్రమే మాన్యువల్ గా మూల్యాంకన చేశామని వాదనలు వినిపించింది ఏపీపీఎస్సీ బోర్డు. ఇరువర్గాల వాదనలు విన్న సింగిల్ జడ్జి బెంచ్ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
2022 మే 26న ఏపీపీఎస్సీ ప్రకటించిన ఉద్యోగుల జాబితాను తిరస్కరించింది. దీంతో ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లలో ఆందోళన మొదలైంది. అయితే.. ఆ అభ్యర్ధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, అభ్యర్ధుల ప్రయోజనాలను కాపాడతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే సింగిల్ బెంచ్ తీర్పును ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ ఎదుట సవాల్ చేసింది. తీర్పుపై స్టే విధించాలని కోరింది.
ఈ క్రమంలో మాన్యూవల్ గా ఒక్క సారే మూల్యాంకనం చేసిన సీసీ కెమెరా పుటేజీలను డివిజన్ బెంచ్ కు ఏపీపీఎస్సీ సమర్పించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై క్షుణ్ణంగా విచారణ జరిపిన జస్టిస్ రవినాథ్ తిల్హారి, జస్టిస్ హరినాథ్ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.