తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు మీడియాతో పాటుగా ఏపీ సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టు, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, పోలవరం చాలా సున్నితమైన ప్రాజెక్టు అని తెలిపారు. “దేశంలో 10 రాష్ట్రాలలో 15 జాతీయ ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. పోలవరానికి వైఎస్ హయాంలో ఖర్చుపెట్టిన నిధులు కూడా పెద్దగా లేదు. టీడీపీ వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేయడం జరిగింది. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాం. మేం ఏకపక్షంగా ముందుకు వెళ్లలేదు“ అని తెలిపారు.
మీడియాపై బాబు నారాజ్
పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాబట్టుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు వెల్లడించారు. “మేం 70శాతం పనులు పూర్తి చేశాం. 30 శాతమే పూర్తిచేశారని వైసీపీ దుష్ప్రచారం చేస్తే, దానిని కూడా మీడియా ఖండించలేకపోవడం బాధాకరం. ప్రజల నుంచి బాధ్యత తీసుకున్న వైసీపీని అడగకుండా టిడిపిని అడుగుతున్నారు“ అంటూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఏడాదిన్నరలో వైసీపీ రూపాయి పని కూడా చేయలేదు కానీ టీడీపీపై నిందలు వేస్తున్నారు, ఇది సరికాదు. ప్రజల పట్ల మా బాధ్యత మేం నెరవేరుస్తాం“ అని హామీ ఇచ్చారు.
జగన్ చులకన అయ్యారు
కేంద్రానికి లేఖలు రాయడం ద్వారా పోలవరం సమస్య పరిష్కారం అవుతుందా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. “లేఖ రాయడంలో కూడా జగన్ మోహన్ రెడ్డి ఎంతో చులకన అయ్యారు. రాష్ట్రానికి ఏం కావాలో అడగకుండా టిడిపిపై బురద జల్లడం ద్వారా చులకన అయ్యారు. ఢిల్లీ వెళ్లి కేంద్రానికి ఏం సమాధానం చెబుతారు..? బుద్ధి, జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు. కేంద్రానికి రాసే లేఖ ఏవిధంగా రాస్తారు..? బాధ్యతతో చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా జాగ్రత్తగా నిపుణులను సంప్రదించి బాధ్యతగా చేయాల్సింది చేయకుండా రాష్ట్ర భవిష్యత్తును ఫణంగా పెట్టడం దారుణం. తన కేసుల విషయంలో ఏవిధంగా ఎదురుదాడి చేసి ప్రజలను మభ్యపెట్టారో, ఇప్పుడు కూడా ఆ విధంగానే మభ్యపెడుతూ రాష్ట్రాన్ని అథోగతి పాలు చేస్తున్నారు.“ అంటూ విరుచుకుపడ్డారు.